గరిడేపల్లి, నవంబర్ 26 : రైతులు పంట దిగుబడి కోసం రసాయన ఎరువులు, కలుపు, పురుగు మందులను ఇష్టారాజ్యంగా వాడడం వల్ల నేల సారం కోల్పోతుంది. కాబట్టి రైతులు సేంద్రియ ఎరువుల వాడకానికి మొగ్గు చూపుతున్నారు. సేంద్రియ ఎరువులు ప్రకృతి పరమైనవి. వీటిని వ్యవసాయ, గృహ వ్యర్థాల నుంచి తక్కువ ఖర్చుతో రైతులే స్వయంగా తయారు చేసుకోవచ్చు. సేంద్రియ స్థూల, సాంద్రీకృత / గాఢ ఎరువులు అని రెండు రకాలు. పశువుల వ్యర్థాలు, గొర్రెలు, మేకల పెంట, బయోగ్యాస్, వర్మికంపోస్ట్ ఎరువు, పచ్చిరొట్ట స్థూల ఎరువులు. వీటిలో తక్కువ మోతాదులో పోషకాలు ఉండడం వల్ల రైతు తన భూమిలో ఎక్కువ పరిమాణంలో వేయాల్సి ఉంటుంది. వీటికి బదులుగా సాంద్రీకృత ఎరువులను తక్కువ పరిమాణంలో వాడినా అధిక మోతాదులో పంట మొక్కలకు అవసరమైన పోషకాలు అందడంతో పాటు హానికర సూక్ష్మజీవులు నశిస్తాయి. సాంద్రీకృత ఎరువులను వాడడం వల్ల రైతులు ఖర్చును బాగా తగ్గించుకోవడంతో పాటు అధిక దిగుబడులను పొందవచ్చునని నిపుణలు చెబుతున్నారు. అయితే సాంద్రీకృత ఎరువుల తయారీ, వాటిలో పోషకాల లభ్యత గురించి గడ్డిపల్లి కేవీకే మృత్తికా శాస్త్రవేత్త అరిగెల కిరణ్ వివరించారు.
పంట మొక్కలకు అవసరమైన పోషకాలు వేసినప్పుడు సేంద్రియ స్వభావం కలిగి ఎక్కువ శాతం నత్రజని, భాస్వరం, పొటాష్ వంటి స్థూల పోషకాలతో పాటు ఇతర పోషకాలను అందించే ఎరువులను సాంద్రీకృత / గాఢ సేంద్రియ ఎరువులు అంటారు. సాంద్రీకృత సేంద్రియ ఎరువులు మెత్తగా పొడి చేసి పంట విత్తే ముందు ఆఖరి దుక్కిలో వేసి కలియదున్నాలి. ఈ ఎరువులు స్థూల ఎరువుల కన్నా త్వరగా విచ్ఛిన్నమై పోషకాలను నేలలోకి విడుదల చేస్తాయి.
మొక్కల సంబంధిత సాంద్రీకృత సేంద్రియ ఎరువులు..
మానవ, పశు ఆహారంగా ఉపయోగపడే కొబ్బరి పిండి, నువ్వుల పిండి, వేరుశనగ పిండితో పాటు ఆముదపు పిండి, ఆవ పిండి, కానుగపిండి, కుసుమ పిండి, పత్తి గింజల పిండి, వేప పిండి. ప్రస్తుతం వేపపిండి ఎక్కువగా వ్యవసాయంలో వాడుతున్నారు. దీని వల్ల ముఖ్యంగా మొక్కలకు హాని కలిగించే నెమటోడ్స్ను నివారించవచ్చు. పంటలకు పిండి వేసినప్పుడు భూమిలో చేదుగుణంగా ఉండి హానికరమైన సూక్ష్మజీవులు చనిపోతాయి.
జంతు సంబంధ సాంద్రీకృత సేంద్రియ ఎరువులు
రక్తహారం : జంతువధశాలల్లో సేకరించిన రక్తాన్ని పూర్తిగా ఎండబెట్టి చూర్ణంగా చేసి అన్ని రకాల నేలల్లో వాడవచ్చు. ఈ ఎరువు మొక్కలకు తొందరగా పోషకాలను అందిస్తుంది.
చేపల ఎరువు : తినడానికి పనికిరాని చేపలు, చచ్చిన, కుళ్లిన చేపలను ఎండబెట్టి చూర్ణం చేసి ఎరువుగా వాడవచ్చు. సముద్ర తీర ప్రాంతాల్లో ఈ ఎరువుల లభ్యత ఎక్కువ.
కొమ్ములు, గిట్టలు : పశువుల కొమ్ములు, గిట్టలు ఎండబెట్టి చూర్ణంగా వాడుతారు. ఇది నెమ్మదిగా నత్రజనిని విడుదల చేస్తుంది.
నేల భౌతిక గుణాలు మెరుగుపడుతాయి..
సాంద్రీకృత ఎరువుల వాడకంతో నేలల్లో నీరు ఇంకే స్వభావం, నీరు నిల్వ చేసే గుణం, ఉష్ణోగ్రత, గాలి ప్రసరణలు మెరుగుపడుతుంది. నేల కోతకు గురికాకుండా ఉంటుంది. పోషకాల వినియోగ సామర్థ్యం పెరుగుదల వంటి భౌతిక గుణాలు మెరుగుపడుతాయి. రసాయనిక ఎరువులు వాడితే వాటి అవశేషాలు పంట దిగుబడుల్లో మిగిలిపోయి వాటిని వాడిన వారి ఆరోగ్యంపై ప్రభావం చూపడంతో పాటు నేల కలుషితమై సారం కోల్పోతుంది. కాబట్టి రైతులు స్థూల, సాంద్రీకృత ఎరువులను ఉపయోగిస్తే మంచిది. ఖర్చు తగ్గడంతో పాటు సాగు చేసిన పంటలకు అధిక మోతాదులో పోషకాలు అందడం వల్ల దిగుబడి పెరుగుతుంది.