చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రముఖ హాస్యనటుడు మయిల్సామి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో దిగనున్నారు. తమిళనాడు రాజధాని చెన్నై నగర పరిధిలోని విరుగంబాక్కం నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగనున్నట్లు మయిల్సామి ఇటీవల ప్రకటించారు. ఈ మేరకు ఆయన సోమవారం విరుగంబాక్కం నియోజకవర్గంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు.
నామినేషన్ అనంతరం మీడియాతో మాట్లాడిన మయిల్సామి.. ఎంజీఆర్, జయలలిత తమిళ సినీరంగంలో అగ్ర హీరో, హీరోయిన్లుగా వెలుగొందారని గుర్తుచేసుకున్నారు. ఆ తర్వాత వారు రాజకీయాల్లో ప్రవేశించి కూడా సమర్థవంతమైన ముఖ్యమంత్రులుగా వ్యవహరించారని కొనియాడారు. వారిపై అభిమానంతోనే తాను గత కొన్నేండ్లుగా అన్నాడీఎంకే పార్టీలో కొనసాగానన్నారు. ఇప్పుడు ఆ ఇద్దరూ లేనందున తాను అన్నాడీఎంకే నుంచి వైదొలిగానని మయిల్సామి చెప్పారు.