నల్లగొండ, డిసెంబర్ 29: తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ తండ్రి స్వర్గీయ మారయ్య పెద్దకార్యంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. మధ్యాహ్నం హెలికాప్టర్ ద్వారా నల్లగొండకు చేరుకున్న సీఎం ఎన్జీ కళాశాలలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద దిగారు. అక్కడి నుంచి పీటీఆర్ కాలనీలో ఉన్న కిశోర్ నివాసానికి చేరుకొన్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి కిశోర్ తండ్రి మారయ్య చిత్రపటం వద్ద నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. కిశోర్ తల్లి సీఎంను చూసి కంట నీరు పెట్టుకోగా దగ్గరకు తీసుకుని ధైర్యం చెప్పారు. అనంతరం కిశోర్ కుమారులను దగ్గరకు తీసుకొన్నారు. మారయ్య గురించి, ఆయన ఉద్యోగం తదితర వివరాలను కుటుంబసభ్యులను అడిగి తెలుసుకొన్నారు.