హైదరాబాద్: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ పార్థివదేహానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఉత్తరప్రదేశ్ చేరుకున్న సీఎం.. ఇటావా జిల్లాలో ఉన్న ములాయం స్వగ్రామం సైఫయీలో ములాయం భౌతికకాయం వద్ద అంజలి ఘటించారు. అనంతరం ఆయన తనయుడు అఖిలేశ్ యాదవ్, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ములాయం అంత్యక్రియల్లో సీఎం పాల్గొననున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంతోష్ కుమార్ సైతం ములాయంసింగ్ యాదవ్ భౌతిక కాయానికి నివాళులర్పించి… కుటుంబ సభ్యులను పరామర్శించారు.
అంత్యక్రియలు ముగిసిన అనంతరం ఇవాళ సాయంత్రం కేసీఆర్ ఢిల్లీకి చేరుకుంటారు. మూడు, నాలుగు రోజుల పాటు కేసీఆర్ ఢిల్లీలోనే మకాం వేయనున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్గా మార్చుతూ తీర్మానం చేసిన తర్వాత తొలిసారి కేసీఆర్ ఢిల్లీకి వెళ్తున్నారు. ఈ సందర్భంగా పలువురు జాతీయ నాయకులతో కేసీఆర్ సమావేశం అయ్యే అవకాశం ఉంది.