మేడ్చల్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): ప్రజాహక్కులు, న్యాయం కోసం పోరాడేందుకు యువత ముందుకురావాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పిలుపునిచ్చారు. దేశ భవిష్యత్తును యువతే నిర్దేశిస్తుందని పేర్కొన్నారు. మేడ్చల్ జిల్లాలోని నల్సార్ విశ్వవిద్యాలయం 18వ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పేదలకు న్యాయం అందించడమే న్యాయవాదుల అంతిమ లక్ష్యం అయి ఉండాలని అన్నారు. న్యాయ విద్యార్థులు క్షేత్రస్థాయిలో ప్రజలతో నేరుగా మాట్లాడి సమస్యలను తెలుసుకోవాలని సూచించారు. భాష ఏదైనా సమాచార మార్పిడి సమర్థంగా, ఆకర్షణీయంగా ఉండాలని తెలిపారు. కోర్టుల్లోని పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి మరింతమంది ప్రత్యేక న్యాయవాదులు కావాలని చెప్పారు. న్యాయవాదులు ఉన్నత స్థాయికి వెళ్లడానికి ముందు విచారణ స్థాయిలో అనుభవం పొందాలని సూచించారు. నల్సార్ వర్సిటీ అనేకమంది ఉత్తమ న్యాయవాదులను తయారుచేస్తున్నదని అన్నారు.
2020-21 విద్యాసంవత్సరంలో న్యాయవిద్య పాసైన విద్యార్థులకు సీజేఐ పట్టాలు అందజేశారు. 104 మంది విద్యార్థులకు గోల్డ్మోడల్స్ ప్రదానం చేశారు. వర్సిటీతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకొన్నారు. ప్రముఖ తెలుగు కవి రావి శాస్త్రి రచించిన ‘ఆరు సారా కథలు’ పుస్తకంలోని ఓ సన్నివేశాన్ని వివరించి న్యాయవాదులకు క్రమశిక్షణ, సమయపాలన ముఖ్యమని ఉద్బోధించారు. కార్యక్రమంలో రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్చంద్రశర్మ, మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.