ముంబై: డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్కు ఈ సీజన్లో ఏదీ కలిసి రావడం లేదు. బ్యాటింగ్, బౌలింగ్లో నిరాశ పరిచిన చెన్నై ఐపీఎల్ 15వ సీజన్లో వరుసగా మూడో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆదివారం జరిగిన పోరులో పంజాబ్ కింగ్స్ 54 పరుగుల తేడాతో చెన్నైపై ఘన విజయం సాధించింది. మొదట పంజాబ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. లియామ్ లివింగ్స్టోన్ (32 బంతుల్లో 60; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) దంచికొట్టగా.. శిఖర్ ధవన్ (33; 4 ఫోర్లు, ఒక సిక్సర్), జితేశ్ (26; 3 సిక్సర్లు) రాణించారు. చెన్నై బౌలర్లలో జోర్డాన్, ప్రిటోరియస్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం ఛేదనలో చెన్నై 18 ఓవర్లలో126 పరుగులకు ఆలౌటైంది. శివమ్ దూబే (30 బంతుల్లో 57; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్ కాగా.. మహేంద్రసింగ్ ధోనీ (28 బంతుల్లో 23; ఒక ఫోర్, ఒక సిక్సర్) ధాటిగా ఆడలేకపోయాడు. ఊతప్ప (13), గైక్వాడ్ (1), మోయిన్ అలీ (0), అంబటి రాయుడు (13), కెప్టెన్ రవీంద్ర జడేజా (0), బ్రేవో (0) విఫలమయ్యారు. పంజాబ్ బౌలర్లలో రాహుల్ చాహర్ 3.. వైభవ్, లివింగ్స్టోన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. లివింగ్స్టోన్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. లీగ్లో భాగంగా సోమవారం లక్నోతో సన్రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది.