ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ పురస్కారాలలో అవార్డు గ్రహీతగా నిలిచిన సకిన రామచంద్రయ్య తెలంగాణ ఆదివాసీ జానపద కళాకారుడు. ఆయన కోయల చరిత్ర కారుడు. ‘సమ్మక్క సారక్క’ పోరాట వీరగాథలను, కోయల ఇలవేల్పుల కథలను కంచుమేళం (డోలి)సాయంతో చెప్పడంలో నేర్పరి.
సకిన రామచంద్రయ్యది కోయ గిరిజన తెగ. కోయజాతిలో సంప్రదాయ వేడుకలను జరిపించడంలో కంచుమేళం కళాకారులది ప్రధాన భూమిక. కోయలకు వీరు అర్తి బిడ్డలుగా వ్యవహరిస్తారు. సాధారణంగా వీరిని ‘డోలి కోయలు’ లేదా ‘పట్టేడోల్లు’ అని పిలుస్తారు. కంచుమేళం కళాకారుడైన రామచంద్రయ్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూ రు మండలం కూనవరంలో జన్మించాడు.
గిరిజనుల ఇలవేల్పుల చరిత్రను, గోత్రాల పూర్వాపరాలను ఉయ్యాల పాటలు పాడుతూ చెప్పడంలో దిట్ట రామచంద్రయ్య. అతని పాట, కంచు మేళం చప్పుడు వింటే.. శివసత్తులు పూనకాలతో ఊగిపోతారు.
తెలుగు రాష్ర్టాలతో పాటు ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని వనదేవతల జాతరల్లో గత 50 ఏండ్లుగా ఆదివాసీ చరిత్రను మౌఖికంగా వినిపిస్తున్నాడు. తన పన్నెండేండ్ల వయసు నుంచే కంచు తాళం, మేళం చేతపట్టి కాళ్లకు గజ్జెలతో మేడారం జాతరకు వన్నె తెస్తున్నాడు.
నాలుగు తరాలుగా ఆదివాసీ సంప్రదాయాల్ని గానం చేస్తున్నది వీళ్ల కుటుంబమే. మేడారం జాతరలో రామచంద్రయ్య పాట, కంచు వాయిద్యం ప్రత్యేక ఆకర్షణ. జాతరలో సమ్మక్క,సారక్క చరిత్ర, వనదేవతల పుట్టు పూర్వోత్తరాలను ఉయ్యాల పాటల రూపంలో పాడుతాడు.
రామచంద్రయ్య కథా సాహిత్యంలో సమ్మక్క పుట్టిన దేశం తూర్పు పులితల వాయిల గోండు పట్నం. సమ్మక్క తండ్రి సాంబమహాశివరాజు అని, తల్లి దూలిముత్తి అని చెప్తాడు. పారెడుగట్టు శాఖన పడమటి దేశం ఏలిన జల సముద్రుడు, మందాల దేవి కొడుకులు గడ్డికామరాజు, గోవిందరాజు, కొండరాజు, పగిడిద్దరాజు గా ఆయన గానం చేస్తాడు.
డోలి వాయిస్తూ వాద్య కథకులు ‘పూర్బం’ చెబుతారు. అంటే గోత్రాల పూర్వ చరిత్ర జ్ఞాపకం చేసుకోవడం. వీరే కోయ చరిత్రను, సంస్కృతిని కాపాడే చరిత్రకారులు. ‘పద్మశ్రీ’తో కంచుమేళం వాయిద్య కళకు దేశవ్యాప్తంగా గుర్తింపుదక్కింది.తరతరాల కోయల సాంస్కృతిక వారసత్వాన్ని నిలుపుతున్న రామచంద్రయ్య వారసత్వాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
-గుమ్మడి లక్ష్మీనారాయణ, 94913 18409