కాన్పూర్: జాతీయ సీనియర్ చెస్ టోర్నీలో తెలంగాణ యువ గ్రాండ్మాస్టర్ ఇరిగేసి అర్జున్ చాంపియన్గా నిలిచాడు. తనదైన ఆటతో ప్రత్యర్థులపై దూకుడు కనబర్చిన ఈ యువ జీఎం అర్జున్ ఆఖరి రౌండ్లో మాజీ చాంపియన్ ఎస్పీ సేతురామన్తో గేమ్ను డ్రా చేసుకున్నాడు. 11 రౌండ్లలో జైత్రయాత్ర సాగించిన అర్జున్ 8.5 పాయింట్లతో గుకేశ్, ఇనియాన్తో సమంగా నిలిచాడు. టైటిల్ కోసం ముగ్గురు పోటీపడడంతో ‘టై’ బ్రేక్ నిర్వహించగా.. అర్జున్ను విజయం వరించింది. టోర్నీ ఆరంభం నుంచి తనదైన ఆటతో ప్రత్యర్థులను చిత్తు చేస్తూ వచ్చాడు. వరుస విజయాలతో ఒకానొక దశలో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లాడు. అనంతరం సహచర ఆటగాళ్లు అర్జున్ సరసన చేరడంతో టైటిల్ పోరు రసవత్తరంగా మారింది. టైటిల్ కోసం అర్జున్తో గుకేశ్ తీవ్రంగా పోటీపడినా నిరాశ ఎదురైంది. ‘టై’ బ్రేక్తో సీనియర్ చెస్ చాంపియన్ టైటిల్ను చేజిక్కించుకున్న అర్జున్ రూ.6 లక్షల నగదు బహుమతి ఖాతాలో వేసుకున్నాడు. టాప్ 10లో అర్జున్తోపాటు గుకేశ్, ఇనియాన్, అరవింద్, ఆర్యన్, కౌస్తవ్ చటర్జీ, కార్తికేయన్, విశాఖ్, సేతురామన్, ప్రణవ్ నిలిచారు.