హైదరాబాద్, మార్చి 24(నమస్తే తెలంగాణ) : అంబేద్కర్, బాబూ జగ్జీవన్రామ్ జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్గా అత్యంత వెనుకబడిన ఎస్సీ వర్గాలకే అవకాశమివ్వాలని 57 ఎంబీఎస్సీల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు భైరి వెంకటేశం మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఎస్సీ ఉపకులాలను కాంగ్రెస్ ప్రభుత్వం మొదటినుంచీ విస్మరిస్తున్నదని మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణ తర్వాత కూడా ఉపకులాలకు న్యాయం చేయడం లేదని నిప్పులు చెరిగారు. ఈ సారైనా జయంతి ఉత్సవాల కమిటీలో అవకాశమివ్వాలని డిమాండ్ చేశారు. ఉత్సవాలను సైతం తూతూమంత్రంగా నిర్వహించకుండా సీఎం, మంత్రులు హాజరుకావాలని కోరారు.
హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): కోదాడ యువకుడు కర్ల రాజేశ్ మృతి కేసులో చిలుకూరు ఎస్సైని ఎందుకు సస్పెండ్ చేయడం లేదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ నిలదీశారు. పోలీస్ వ్యవస్థ రాజకీయాలకు పోలీసు వ్యవస్థ తలొగ్గిందా? అని ప్రశ్నించారు. ఈ విషయమై మంగళవారం ఆయన డీజీపీ శివధర్రెడ్డితోపాటు లా అండ్ ఆర్డర్ ఏడీజీ మహేశ్ భగవత్, మల్టీజోన్-2 ఏడీజీ డీఎస్ చౌహాన్కు మరోసారి ఫిర్యాదు చేశారు. ఈ కేసు దర్యాప్తు నత్తనడకన సాగుతున్నదని మండిపడ్డారు. రాజేశ్ మృతికి ప్రధాన బాధ్యుడైన ఎస్ఐని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
రాజేశ్ తల్లి లలితమ్మ ఫిర్యాదును ఉద్దేశపూర్వకంగా పట్టించుకోని కోదాడ డీఎస్పీ శ్రీధర్రెడ్డి, ఆ తర్వాత వచ్చిన డీఎస్పీ శ్రీనివాస్రెడ్డి, సూర్యాపేట ఎస్పీ నరసింహపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్లోని సెక్షన్-4 ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. రాజేశ్ తల్లితో రూ.8 లక్షలకు సెటిల్మెంట్ చేసుకునేందుకు ప్రయత్నించిన డీఎస్పీతోపాటు వీడియోగ్రాఫర్ రామకృష్ణారెడ్డి, గాంధీ దవాఖానలో రాజేశ్ మృతదేహానికి పోస్టుమార్టం చేసిన డాక్టర్ లక్ష్మీకాంత్రెడ్డిపై విచారణ జరిపించి, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా తగిన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.