అవార్డుల ఖిల్లాగా పేరుగాంచిన సిద్దిపేట జిల్లా మరో ఘనత సాధించింది. సోమవారం విడుదలైన బాసర ట్రిపుల్ ఐటీ ఫలితాల్లో రాష్ట్రంలోనే అత్యధిక సీట్లను సాధించి జిల్లా సత్తా చాటింది. మొత్తం 1404 సీట్లకు రాష్ట్రంలోనే అత్యధికంగా 322 సీట్లు జిల్లా కైవసం చేసుకుంది.జిల్లాలో అత్యధికంగా సిద్దిపేట అర్బన్ మండలానికి 54 సీట్లు దక్కాయి. పదోతరగతి ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలోనే రెండోస్థానం పొందింది.ట్రిపుల్ ఐటీ ఫలితాల్లోనూ మొదటి స్థానంలో నిలిచింది. ఏ రంగంలో అయినా మొదటి స్థానంలో ఉండాలన్న మంత్రి హరీశ్రావు మాటలను విద్యాశాఖ అధికారులు నిజం చేశారు. జిల్లా విద్యార్థులు అత్యధిక సీట్లు సాధించడంతో మంత్రి హరీశ్రావు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు జిల్లా అధికార యంత్రాంగం, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులకు అభినందనలు తెలిపారు.
– సిద్దిపేట అర్బన్, జూలై 4
సిద్దిపేట అర్బన్, జూలై 4: సిద్దిపేట జిల్లా మరోసారి అగ్రగామిగా నిలిచింది. ఇప్పటికే అన్నిరంగాల్లో ముందంజలో ఉన్న సిద్దిపేట సోమవారం వెలువడిన బాసర ట్రిపుల్ ఐటీ ఫలితాల్లో జిల్లా సత్తా చాటింది. బాసర ట్రిపుల్ ఐటీలో ఆరేండ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సుల్లో మొత్తం 1404 సీట్లకు రాష్ట్రంలోనే అత్యధికంగా 322 సీట్లు సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచింది. జిల్లా అత్యధికంగా సిద్దిపేట అర్బన్ మండలానికి 54 సీట్లు దక్కగా, ధూళిమిట్ట, మిరుదొడ్డి మండలాలకు సీట్లు రాలేదు. పదో తరగతి ఫలితాల్లో నాలుగేండ్ల నుంచి అగ్రస్థానంలో ఉన్న జిల్లా ట్రిపుల్ ఐటీ సీట్లలో అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలో అత్యధికంగా ట్రిపుల్ ఐటీ సీట్లు జిల్లాకు రావడం ఇది విద్యాశాఖ అధికారుల సమష్టి కృషి అని మంత్రి హరీశ్రావు అభినందించారు.
జిల్లాకు 322 ట్రిపుల్ ఐటీ సీట్లు..
జిల్లా వ్యాప్తంగా 322 ట్రిపుల్ ఐటీ సీట్లు రాగా, అత్యధికంగా సిద్దిపేట అర్బన్ మండలానికి 54 సీట్లు దక్కాయి. చిన్నకోడూరు మండలానికి 46, నంగునూరు మండలానికి 40, తొగుట మండలానికి 35, కోహెడ మండలానికి 31, చేర్యాల 15, నారాయణరావుపేట 14, దుబ్బాక 10, సిద్దిపేట రూరల్ 4, బెజ్జంకి 2, దౌల్తాబాద్ 9, రాయపోల్ 2, వర్గల్ 3, ములుగు 5, మర్కూక్ 1, జగదేవ్పూర్ 1, గజ్వేల్ 4, కొండపాక 5, కొమురవెళ్లి 5, మద్దూరు 8, అక్బర్పేట భూంపల్లి 10, కుకునూరుపల్లి 6 సీట్లు వచ్చాయి, ఎంపికైన విద్యార్థులకు ఈ నెల 7,8,9 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.