హైదరాబాద్ : హుస్సేన్సాగర్లో బాలాపూర్ వినాయకుడి నిమజ్జనం కార్యక్రమం సంపూర్ణమైంది. నవరాత్రుల పాటు భక్తుల పూజలందుకున్న గణపతి ఆదివారం ఉదయం శోభాయాత్రగా నిమజ్జనం కోసం బయలుదేరాడు. బాలాపూర్, చాంద్రాయణగుట్ట, ఛత్రినాక, చార్మినార్, అఫ్జల్గంజ్, అబిడ్స్, బషీర్భాగ్, లిబర్టీ మీదుగా ట్యాంక్బండ్కు చేరుకున్నాడు. తొమ్మిదో నెంబర్ క్రేన్ మీదుగా బాలాపూర్ గణనాథుడు గంగమ్మ ఒడికి చేరాడు. ఎంతో చరిత్ర కలిగిన బాలాపూర్ గణపతి నిమజ్జన వేడుకలు ఇవాళ తెల్లవారు జామున ప్రారంభమయ్యాయి.
ఐదున్నర గంటలకే ఉత్సవసమితి ఆధ్వర్యంలో చివరిపూజలు అందుకున్న లంబోదరుడు గ్రామ ఊరేగింపుకు బయల్దేరారు. బాలాపూర్పుర వీధులగుండా అత్యంత భక్తి శ్రద్ధలతో భజనలు.. సన్నాయి మేళాల నడుమ నిర్వాహకులు శోభాయాత్ర నిర్వహించారు. 9 గంటల తర్వాత గణపతి ప్రధాన కూడలి వద్దకు చేరుకోగానే వేలంపాట నిర్వహించారు. ఎంతో ప్రాధాన్యత ఉన్న బాలాపూర్ లడ్డూ మరో సారి రికార్డు ధర పలికింది. ఈ ఏడాది రూ. 18.90లక్షలకు నాదర్గుల్కు చెందిన మర్రి శశాంక్ రెడ్డి, కడప ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ కలిసి లడ్డూను దక్కించుకున్నారు.
2019లో రూ.17.6 లక్షలకు కొలను రాంరెడ్డి లడ్డూను వేలంపాటలో దక్కించుకున్నారు. గతేడాది కరోనా కారణంగా లడ్డూ వేలం పాట రద్దయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బాలాపూర్ నుంచి శోభాయాత్ర మొదలైంది. వివిధ మార్గాల్లో ట్యాంక్బండ్ వరకు 17 కిలోమీటర్ల మేరకు ప్రయాణించి గంగమ్మ ఒడికి చేరాడు. పలు చోట్ల వర్షం కురిసినా భక్తుల కోలాహలం మధ్య శోభాయాత్ర నిర్విరామంగా కొనసాగింది. శోభాయాత్ర నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.