రామగుండం : మావోయిస్టు పార్టీలో సాంకేతిక నిపుణులు(Technical Experts)గా పనిచేస్తున్న ఇద్దరు మావోయిస్టు సభ్యులను రామగుండం పోలీసులు అరెస్టు చేశారు. శనివారం రామగుండం పోలీస్ కమిషనర్ రెమో రాజేశ్వరి (Remo Rajeshwari) మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు.
పోలీసులకు అందిన సమాచారం మేరకు మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందారం గ్రామంలో ఓ ఇంట్లో ఇద్దరు మావోయిస్టు సభ్యులున్నారన్న సమాచారం మేరకు ఆ ఇంటిని తనిఖీ చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని ఆమె పేర్కొన్నారు. సీపీఐ మావోయిస్టు పార్టీ సెంట్రల్ టెక్నికల్ టీం క్యాడర్ గంగాధర రావు(Gangadhar Rao) అలియాస్ నర్సన్న , అతడి భార్య భవానీ(Bhavani) అలియాస్ సుజాత అలియాస్ శ్యామలను అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశామన్నారు.
ఏపీలోని అంబేద్కర్ కోనసీమ జిల్లా గన్నవరం మండలం నరేంద్రపురం గ్రామానికి చెందిన గంగాధర రావు, మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గ్రామానికి చెందిన భవానిని అరెస్టు చేశామన్నారు. వీరి వద్ద నుంచి రూ. 1. 57,900 , రెండు మొబైల్ ఫోన్లు, ఆధార్, పాన్కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. రెండు పెన్ డ్రైవ్లు, తెలంగాణ రెండవ ప్లీనరీ తీర్మానాల ప్రతులు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.