హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు కల్చర్ నేర్పింది ఏపీ ప్రజలేనట.. హైదరాబాద్ అభివృద్ధి చెందింది కోస్తాంధ్ర ప్రజల వల్లేనట.. ఈ మాటలన్నది ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు. ఏపీలోనే కాదు 16 రాష్ర్టాల్లో విద్యుత్తు కోతలున్నాయి.. తెలంగాణలో లేవా? అని ఆ రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్ అడిగారు. మరో మంత్రి బొత్స సత్యనారాయణ ఓ అడుగు ముందుకేసి.. హైదరాబాద్లో జనరేటర్ పెట్టుకొని ఉండివచ్చానని వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలపై తెలంగాణ సమాజం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వాస్తవానికి, క్రెడాయ్ ప్రాపర్టీ ఎక్స్పో ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ‘నా మిత్రుడొకరు సంక్రాంతికి ఏపీలోకి సొంతూరికి వెళ్లారు. అక్కడికి వెళ్లిన వెంటనే నాకు ఫోన్ చేసి.. ఇక్కడ కరెంట్ లేదు, నీళ్లు లేవు, రోడ్లు ధ్వంసమయ్యాయి అని చెప్పార’ని మంత్రి తెలిపారు. దీంతో ఏపీ మంత్రులు తెలంగాణపై ఉన్న అక్కసునంతా వెళ్లగక్కారు. అవాస్తవాలు మాట్లాడారు.
వీరిపై తెలంగాణ ప్రజలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణకు సంస్కృతి నేర్పారా? ఆడబిడ్డను బతుకమ్మగా పేర్చి ఆరాధించే సంస్కృతి తెలంగాణది. ఈ సంస్కృతి ఏపీ నేర్పిందా? అని ప్రశ్నిస్తున్నారు. శతాబ్దాలుగా మత సామరస్యం వెల్లివిరిసే ఈ ప్రాంతానికి సంస్కృతి నేర్పింది మీరా? అని నిలదీస్తున్నారు. ఇక, విద్యుత్తు కోతలపై మాట్లాడిన ఏపీ మంత్రులపైనా తెలంగాణ ప్రజలు మండిపడ్డారు.
2 నిమిషాలు కూడా కరెంటు పోకుండా తెలంగాణ సర్కారు 24 గంటల నాణ్యమైన కరెంటు ఇస్తుంటే ఇంత అక్కసా?, అసలు మీ ఏపీలోనే కదా పవర్ హాలిడే ప్రకటించింది.. అది నిజం కాదా? ఆ ప్రభావంతో దవాఖానల్లో గర్భిణులు, బాలింతలు అవస్థలు పడ్డది వాస్తవం కాదా? సెల్ఫోన్ వెలుతురులో డెలివరీ చేయలేదా? ప్రాసెసింగ్ పరిశ్రమలు 50 శాతం విద్యుత్తే వాడాలని నిబంధనలను పెట్టలేదా? ఉన్న మాటంటే ఉలుకెందుకు? అని ప్రశ్నిస్తున్నారు. ఏపీలో విద్యుత్తు కోతలు ఉన్నాయని మంత్రి గుడివాడ అమర్నాథే స్వయంగా ఒప్పుకొన్నారు. మరి దీనికి బొత్స ఏం సమాధానమిస్తారు? అని నిలదీస్తున్నారు.