ఏపీ సినిమా టికెట్ల ధరలకు సంబంధించిన వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతున్నది. టికెట్ రేట్లను తగ్గిస్తూ ప్రభుత్వం జారీచేసిన జీవో 35ని ఇటీవల హైకోర్టు రద్దు చేసింది. కోర్టు ఆదేశాలను ప్రభుత్వం సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ను ఆశ్రయించింది. ఈ వివాదం పూర్తిగా సద్దుమణగకముందే ప్రభుత్వం మరో కొత్త జీవో 142ను జారీచేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం సినిమా టికెట్ల అమ్మకాలన్నీ ప్రభుత్వ నియంత్రణలోనే ఆన్లైన్ ద్వారా జరగనున్నాయి. టికెట్ల అమ్మకాల బాధ్యతను ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్కు ప్రభుత్వం అప్పగించింది. ఇందుకోసం ఐఆర్సీటీసీ తరహాలో ప్రత్యేక వెబ్సైట్ను ఏర్పాటుచేయబోతున్నట్లు తెలిసింది. ఈ వెబ్సైట్ ద్వారానే ప్రేక్షకులు సినిమా టికెట్లను కొనుగోలు చేయాల్సిఉంటుంది. ప్రైవేటు బుకింగ్ ప్లాట్ఫామ్స్ ద్వారా టికెట్స్ను ఇకపై బుక్ చేసుకోరాదు. త్వరలో జీవో 142ను అమలులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.