రికార్డు స్థాయిలో 40 మిలియన్ టన్నులకు ఐరన్ ఓర్ వార్షిక ఉత్పత్తి
హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ రంగ ఖనిజ ఉత్పాదక సంస్థ ఎన్ఎండీసీ వార్షిక ఉత్పత్తిలో సరికొత్త రికార్డును సృష్టించింది. ఈ ఆర్థిక సంవత్సరం (2021-22)లో ఇప్పటిదాకా 40 మిలియన్ టన్నుల ఐరన్ ఓర్ను ఉత్పత్తి చేసినట్టు ఎన్ఎండీసీ శనివారం తెలియజేసింది. దీంతో దేశంలో ఒక ఆర్థిక సంవత్సరంలో ఈ స్థాయిలో ఐరన్ ఓర్ను ఉత్పత్తి చేసిన సంస్థ ఎన్ఎండీసీనేనని ఉక్కు మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. గత ఆర్థిక సంవత్సరం (2020-21) సంస్థ ద్వారా 35 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరిగింది. కాగా, 1969-70లో కేవలం 4 మిలియన్ టన్నుల ఉత్పత్తినే చేసిన ఎన్ఎండీసీ.. 1977-78లో పది మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తికి చేరింది. 2004-05లో 20 మిలియన్ టన్నులు, అనంతరం పదేండ్లలో 30 మిలియన్ టన్నుల ఉత్పత్తిని సాధించగా.. ఇప్పుడు 40 మిలియన్ టన్నులకు చేరింది. ఈ క్రమంలోనే 2030 నాటికి ఏటా 100 మిలియన్ టన్నుల ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ సందర్భంగా ఎన్ఎండీసీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సుమిత్ దేబ్ సిబ్బందిని అభినందిస్తూ ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రికార్డు స్థాయి ఉత్పత్తిని నమోదు చేశామన్నారు.
ఐఐటీ-ఖరగ్పూర్తో ఒప్పందం
డ్రోన్ల వినియోగం ద్వారా ఖనిజాన్వేషణ చేసేందుకు వీలుగా ఐఐటీ-ఖరగ్పూర్తో ఎన్ఎండీసీ ఒప్పందం చేసుకున్నది. ఇరు సంస్థల అధికారులు ఈ ఎంవోయూపై వర్చువల్ పద్ధతిలో సంతకాలు చేశారు. ఐరన్ ఓర్తోపాటు కాపర్, రాక్ పాస్ఫేట్, లైమ్స్టోన్, మాగ్నసైట్, డైమండ్, టంగ్స్టన్, బీచ్ సాండ్స్ తదితర ఖనిజాలనూ ఎన్ఎండీసీ ఉత్పత్తి చేస్తున్నది.