మైలార్దేవ్పల్లి : ఖాళీగా ఉన్న స్థలాల్లో రాత్రికి రాత్రి విగ్రహాలను ఏర్పాటు చేసి భూమిలో నుండి వెలసిందని కొందరు నమ్మ బలికే ప్రయత్నం చేశారు. బుధవారం మైలార్దేవ్పల్లి డివిజన్ పరిధిలోని టీఎన్జీవోస్ కాలనీలో హూడా పార్కుకు ఆనుకొని ఉన్న ఖాళీ స్థలంలో గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి సమయంలో రెండు అడుగుల నూతన రాతి వినాయకుడి విగ్రహాన్ని మట్టిలో పాతి పెట్టారు.
ఉదయం సమయంలో వినాయకుడి తల భాగం బయటికి కనబడింది అంటూ ప్రచారం మొదలు పెట్టారు. దీంతో కొందరు వ్యక్తులు విగ్రహాన్నీబయటకి తీసి పూజలు నిర్వహించారు. దీంతో ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఆనోట ఈ నోట స్థలాన్ని కొన్న వ్యక్తులకు తెలియడంతో వారు స్థానిక నాయకులతో అక్కడికి వచ్చి పరిశీలించారు.
కాగా అక్కడ ఎలాంటి విగ్రహాలు భూమిలో నుండి బయటకు రాలేదని, భూమిని కబ్జా చేయాలనే ఉద్దేశంతోనే ఎవరో కావా లని ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల నమ్మకాలతో ఆడుకునే ఇలాంటి ప్రయత్నాలు మానుకోవాలని హెచ్చరించారు. అయితే స్థానికులు మాత్రం అదేం పట్టించుకోకపోగా ఆ విగ్రహాన్ని అక్కడినుంచి తీయవద్దని స్థల యజమానితో గొడవకు దిగారు.
కాగా వారికి స్థానిక నాయకులు నచ్చచెప్పడంతో గొడవ సద్దుమనిగింది. స్థానిక యువకులు విగ్రహాన్ని తొలగించడంతో గొడవ అంతటితో ముగిసింది.