ప్రజల జీవితాలను ఆర్థిక వనరులు ప్రభావితం చేస్తాయి. ఆర్థిక వనరుల ప్రణాళికబద్ద రూపమే బడ్జెట్. బడ్జెట్ అనేది ఆదాయ వ్యయాల పత్రం మాత్రమే కాదు. అది ప్రభుత్వ ఆర్థిక విధాన సాధనం. సంక్షేమ రాజ్య లక్ష్యసాధనలో భాగంగా ప్రజల సంక్షేమం, అభివృద్ధికి అవసరమైన ప్రభుత్వాల లక్ష్యాలను, వ్యూహాలను బడ్జెట్ ప్రతిబింబిస్తుంది. సామాన్య, దిగువ, మధ్య తరగతి శ్రేణులకు భరోసా కల్పించడమే సంక్షేమ ప్రభుత్వాల లక్ష్యం.
ఇటీవల ఆక్స్ఫామ్ నివేదిక ప్రకారం దేశ సంపదలో 40శాతం కేవలం 1శాతం ధనవంతుల చేతిలో ఉంటే 50 శాతం ఉన్న ప్రజల చేతుల్లో ఉన్నది 3శాతం మాత్రమే. జీఎస్టీ ద్వారా రికార్డ్ స్థాయి లో రూ.14.83 లక్షల కోట్లు ఆర్జిస్తే అందులో 62 శాతం సామాన్యుల నుంచి వచ్చిందే. బిలియనీర్ల నుంచి వచ్చింది కేవలం 3శాతమే. 2020-22 మధ్య బిలియనీర్ల సంపద సగటున రోజుకు రూ. 3,608 కోట్లకు పెరిగింది. గత బడ్జెట్లలో కార్పొరేట్ పన్ను 12 నుంచి 7 శాతానికి తగ్గింది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ గణాంకాల ప్రకారం దేశంలో నిరుద్యోగిత రేటు అత్యధికంగా 8.3 శాతానికి చేరింది. ఇటువంటి పరిస్థితుల్లో సామాన్యుడే కేంద్ర బింధువుగా బడ్జెట్ రూపకల్పన అత్యంత అవశ్యం.
దేశ ప్రగతిలో విద్యారంగం అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం. కానీ దేశానికి స్వతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడుస్తున్నా విద్యా వ్యవస్థలో సాధించిన పురోగతంటూ ఏమీ లేదు. నాణ్యమైన, గుణాత్మక విద్యను అందించాలంటే జీడీపీ లో 6శాతం నిధులు కేటాయించాలని 1966లో కొటారి కమీషన్ పేర్కొన్నది. ‘జాతీయ విద్యా విధానం-2020’ సైతం ఇదే విషయాన్ని దృవీకరించింది. కానీ గత 5 బడ్జెట్లలో కేటాయింపులు తగ్గడంతో దేశంలో విద్యా ప్రమాణాలు దెబ్బ తిన్నాయి. నేటికీ దేశంలో చాలా విద్యాలయాలు కనీస మౌలిక వసతులకు కూడా నోచుకోలేదు. దీనివల్ల నష్టపోతున్నది ప్రభుత్వ విద్యాలయాల్లో చదువుతున్న సామాన్యులే. అంతర్జాతీయ ర్యాంకింగ్లో మనదేశం నుంచి కనీసం ఒక్క యూనివర్సిటీ కూడా 100లోపు ర్యాంక్ సాధించలేకపోవడం దేశ విద్యా వ్యవస్థ ధీనస్థితికి పరాకాష్ట. 2023 బడ్జెట్లో వీటన్నింటినీ పరిష్కరించాల్సిన అవసరం ఉన్నది. సామాన్యుడి ఆర్థిక స్థితిని ప్రభావితం చేసేది ఆరోగ్యం. అయినప్పటికీ ప్రభుత్వం వైద్య రంగాన్ని ప్రాధా న్యత లేని అంశంగానే చూస్తున్నది. గత ఐదేండ్లలో వైద్య రంగానికి బడ్జెట్ కేటాయింపులు 2.16 నుంచి 2.01 శాతానికి పడిపోయాయి. వైద్య రంగానికి బడ్జెట్ కేటాయింపుల్లో ప్రాదాన్యతనిచ్చే 189 దేశాల జాబితాలో మనదేశం 179 వ స్థానంలో ఉన్నది. ఇది 2021లో ప్రపంచ బ్యాంక్, ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన వాస్తవం. వైద్య రంగంలో జరుగుతున్న ఖర్చులో కేవలం 27% మాత్రమే ప్రభుత్వ వ్యయం కాగా, మిగిలిన 73% భారం సామాన్యుడి మీదే పడుతున్నది. ఈ నేపథ్యంలో ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాల్చిన అవసరం ఉన్నది.
దేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ రంగమే వెన్నెముక. గ్రామీణ ప్రాంత పేదలు, వ్యవసాయ కూలీలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వ్యవసాయ రంగం పై ఆధారపడి జీవిస్తున్నారు. గత కోవిడ్ సమయంలో సంక్షోభంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను నిలబెట్టింది వ్యవసాయ రంగమే. కానీ దేశ జీడీపీ లో 16 శాతం వాటా కలిగి ఉన్న వ్యవసాయ రంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నది. దేశంలో సరైన వ్యవసాయ విధానాలు, చేయూత లేకపోవడం వల్ల వ్యవసాయం లాబసాటిగా లేదు. రైతుల ఆదా యం రెట్టింపు అవ్వాలంటే పెట్టుబడి ఖర్చు తగ్గాలి, దిగుబడి, మద్దతు ధర పెరగాలి.
భారత దేశం ధనిక దేశమే కానీ ప్రజలే పేదవాళ్ళు అనేది ఆక్స్ఫామ్ నివేదిక ద్వారా తేటతెల్లమైంది. ప్రజల కనీస అవసరాలను తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే అన్న భారత రాజ్యాంగ స్ఫూర్తి ఆర్థిక కేటాయింపుల్లో కనబడకపోవడం అత్యంత బాధాకరం. ప్రపంచ ఆకలి సూచీలో దేశ పరిస్థితి క్రమంగా దిగజారుతూ 107 వ స్థానానికి చేరింది. ఐరా స అనుబంధ సంస్థలు ప్రకటించిన స్టేట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రీషన్ ఇన్ ది వరల్డ్ గణాంకాల ప్రకారం దేశంలో 40.6% మంది మితమైన లేదా తీవ్రమైన ఆహార అభద్రతతో ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సమస్య ఎదుర్కొంటున్న వారిలో 37% మంది భారతీయులే. హంగర్ మీటర్ ఇండెక్స్లో దేశం 29.1% తో విపత్కర పరిస్థితుల్లో ఉన్నది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పౌష్టికాహార బాధితుల్లో 26% మంది భారతీయులే. ఈ సంక్షోభంలోనూ ఆహార ధాన్యాలపై సబ్సిడీ 28 శాతం తగ్గించి సామాన్యుడిపై పెనుభారాన్ని మోపారు.
ప్రజల కొనుగోలు శక్తి పెరగాలంటే ఉపాధి అవకాశాలు సృష్టించబడాలి. ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాల్సిన అవసరం ఉన్నది. కానీ గత బడ్జెట్ లో అందుకు భిన్నంగా మహత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రూ. 93 వేల కోట్ల నుంచి రూ.73 వేల కోట్లకు తగ్గించి వారి ఉపాధి అవకాశాలను దెబ్బతీసింది.
పెట్రోల్ పై సబ్సీడీ రూ.6517 కోట్ల నుంచి రూ.5813 కోట్లకు తగ్గించారు. గతంలో ఎన్నడూ లేనంత భారీగా పెట్రోలియం ధరలు పెరిగాయి. దీనిపై ఈ బడ్జెట్ లో ప్రభుత్వం పునరాలోచన చేయాలి. సార్వత్రిక ఎన్నికలకు ముందు చివరి బడ్జెట్ కావడంతో ఈసారైనా సామాన్య మానవుడికి అనువుగా బడ్జెట్ ప్రవేశపెడతారేమో అని యావత్ దేశం ఆతృతతో ఎదురు చూస్తున్నది. ఇప్పుడున్న పరిస్థితుల్లో సామాన్యుడి ఆకలిని తీర్చే బడ్జెట్ నే ప్రజలు కోరుకుంటున్నారు. అంకెల గారడిలా కాకుండా క్షేత్ర స్థాయిలో ప్రజల ఆశలకు అనుగుణంగా, సామాన్యుడు ఆత్మగౌరవం, ఆత్మ విశ్వాసంతో బ్రతికేలా బడ్జెట్ రూపొందించాలి.
– ప్రొఫెసర్ తాటికొండ రమేష్
(వ్యాసకర్త : ఉప కులపతి, కాకతీయ యూనివర్సిటీ)