ఆధునికతను, సాంకేతికతను మన అవసరాలకు వాడుకోవడం ద్వారా ముందుకెళ్లేందుకు మరింత వీలు చిక్కుతుంది. అయితే, సాంకేతికతను మనం వాడుకునే విధంగా వాడుకోవడం లేదన్న అపవాదు ఉన్నది. మరీ ముఖ్యంగా నేటి యువతరం ఆధునిక సాంకేతికతను ఇష్టం వచ్చినట్లుగా వాడుతూ టైంపాస్ చేస్తున్నారనేది కూడా వింటున్నాం. ఆధునిక సాంకేతికతకు మారుపేరుగా నిలిచిన ఇంటర్నెట్, మొబైల్ ఫోన్స్, సోషల్ మీడియాలను యధేచ్చగా వాడుతూ లేని సమస్యలు కొని తెచ్చుకుంటున్నది కూడా నిత్యం చూస్తున్నాం. అయితే, కొన్నిసార్లు ఈ సాంకేతికత కూడా మనకు ఉపయోగపడుతుందని ఈ ఉదాహరణ వెల్లడిస్తున్నది. 20 ఏండ్ల క్రితం కనిపించకుండాపోయిన ఓ తల్లిని.. పాకిస్తాన్కు చెందిన ఓ వ్యక్తి ఫేస్బుక్ పేజీలో ఆమె కుమారుడు గుర్తించాడు.
ముంబయిలో నివసించే హమీదా బాను తన కుటుంబాన్ని బాగా చూసుకోవాలన్న కోరికతో వంట మనిషిగా ఖతర్తోపాటు ఇతర అరబ్ దేశాల్లో పనిచేసింది. నాలుగు సంవత్సరాల అనంతరం దుబాయ్కు వెళ్లిన హమీదా బాను అదృష్యమైంది. తల్లి ఎక్కడ, ఎలా ఉందో అని దుబాయ్కు పంపిన ఏజెంట్ వద్ద ఆమె కుమారుడు యాస్మీన్ షేక్, కుమార్తె షాహీదా ఆరా తీశారు. ఆమె ఆనందంగానే ఉన్నదని.. అయితే, ఎక్కడ ఉన్నదో చెప్పకూడదని తనతో ఒట్టేయించుకున్నదని చెప్పింది. దాంతో చేసేదేమీ లేక ఉసూరుమంటూ ఇంటి ముఖం పట్టారు.
అయినా, తల్లి జాడ కోసం వారు పట్టు సడలించలేదు. ఏదో ఒకరోజు తమను కలుస్తుందన్న ఆశతో వెతుకుతుండగా.. పాకిస్తాన్కు చెందిన ఓ వ్యక్తి ఫేస్బుక్ పేజీలో ఫొటో రూపంలో ప్రత్యక్షమైంది. దాంతో ఉబ్బితబ్బిబ్బైన వారు ఆమెను పాకిస్తాన్ నుంచి ముంబయికి రప్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని హమీదా బాను కుమారుడు యాస్మీన్ షేక్ విజ్ఞప్తి చేస్తున్నాడు. 20 ఏండ్ల తర్వాత తన తల్లి జాడ తెలిసినందుకు చాలా సంతోషంగా ఉన్నదంటున్న షేక్.. తల్లి ఫొటో షేర్ చేసిన పాకిస్తాన్కు చెందిన మారుఫ్కు కృతజ్ఞతలు తెలిపాడు. ఇన్నేండ్ల తర్వాత తల్లిని కలవడం అద్భుతంగా భావిస్తున్నట్లు షాహీదా చెప్పింది.