సిటీబ్యూరో, జనవరి 1 (నమస్తే తెలంగాణ): కరోనా థర్డ్వేవ్ సంకేతాలు అందుతున్న నేపథ్యంలో గ్రేటర్ వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. వేవ్ వచ్చినా.. రాకున్నా ముందు జాగ్రత్త చర్యగా అన్ని ప్రభుత్వ దవాఖానల్లో ఆక్సిజన్ నిల్వలు అందుబాటులో ఉండే విధంగా ఆరోగ్యశాఖ చర్యలు తీసుకుంటున్నది. సెకండ్వేవ్ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని.. అన్ని విధాలుగా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే దేశంలోని పలు రాష్ర్టాల్లో కేసులు గణనీయంగా పెరుగుతుండటంతో ప్రభుత్వ దవాఖానలు, కొవిడ్ కేర్ సెంటర్లలో ఆక్సిజన్ నిల్వలను ఏర్పాటు చేస్తున్నారు. గ్రేటర్లో మొత్తం 3, 133 ఆక్సిజన్ పడకలను సిద్ధం చేయగా, మరో వెయ్యి వరకు పెంచుకునే సౌలభ్యం ఉన్నట్లు వైద్యాధికారులు తెలిపారు.
సెన్సార్ల ద్వారా పరిశీలన
నగరంలోని అన్ని ప్రధాన ప్రభుత్వ దవాఖానల్లో లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకులతో పాటు ఉత్పత్తి యంత్రాలను సిద్ధం చేశారు. వీటిని కరోనా సెకండ్ వేవ్లోనే అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే వీటి పర్యవేక్షణకు నగరంలోని ప్రతి ప్రభుత్వ దవాఖానలో ప్రత్యేక సిబ్బందిని కేటాయించినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. ప్లాంట్లలో ఆక్సిజన్ నిల్వలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ప్రత్యేక సెన్సార్ వ్యవస్థలను నెలకొల్పారు. గాంధీ, టిమ్స్, నిమ్స్, ఛాతి దవాఖాన, కింగ్కోఠి తదితర అన్ని కొవిడ్ కేర్ సెంటర్లలో ఈ సెన్సార్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. వీటి ద్వారా ఆక్సిజన్ నిల్వలను నిరంతరం పరిశీలిస్తూ.. సమాచారాన్ని ఉన్నతాధికారులకు చేరవేస్తారు. అవసరానికి తగిన నిల్వలు లేకపోతే వెంటనే వాటిని సమకూర్చే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటారు. దీనివల్ల ఆక్సిజన్ కొరత ఏర్పడకుండా ఉంటుంది.