దుబాయ్, జనవరి 17: యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) రాజధాని అబుదాబి నగరంపై సోమవారం డ్రోన్ల దాడి జరిగింది. తొలుత నగరంలోని అంతర్జాతీయ విమానాశ్రయం లక్ష్యంగా దాడి చోటుచేసుకోగా, తరువాత ముస్తఫా ప్రాంతంలోని అబుదాబి నేషనల్ ఆయిల్ కార్పొరేషన్(ఏడీఎన్ఓసీ)కి చెందిన ఆయిల్ నిల్వ ప్రాంతంపై మరో దాడి చోటుచేసుకున్నది. ఎయిర్పోర్టు విస్తరణలో భాగంగా నిర్మాణంలో ఉన్న ప్రాంతంపై జరిగిన దాడి చిన్నదేనని పోలీసులు తెలిపారు.
ఆ తరువాత రెండో దాడిలో మూడు ఆయిల్ ట్యాంకర్లు పేలడంతో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా, ఆరుగురు గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు భారతీయులు, పాకిస్థాన్కి చెందిన వ్యక్తి ఒకరు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఇద్దరు భారతీయులు మరణించినట్టు ధ్రువీకరించిన భారత రాయబారి సంజయ్ సుధీర్.. వారిని గుర్తించాల్సి ఉన్నదని తెలిపారు. తదుపరి వివరాల కోసం యూఏఈ అధికారులను సంప్రదిస్తున్నామని అబుదాబిలోని రాయబార కార్యాలయం పేర్కొన్నది. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం డ్రోన్ల వంటి ఎగిరే చిన్న వస్తువుల ద్వారా ఈ దాడికి పాల్పడినట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైందని అబుదాబి పోలీసులు తెలిపారు.
ఆపరేషన్ వివరాలు త్వరలో చెప్తాం..
తామే ఈ దాడికి పాల్పడినట్టు యెమెన్కి చెందిన హౌతీ తిరుగుబాటుదారులు ప్రకటించుకున్నారు. యూఏఈ భూభాగంపై నిర్వహించిన ఆపరేషన్కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని ఆ సంస్థ అధికార ప్రతినిధి యెహియా ఓ ప్రకటన ద్వారా పేర్కొన్నారు. 2018లో కూడా హౌతీ తిరుగుబాటుదారులు అబుదాబి విమానాశ్రయంపై దాడి చేశారన్న వార్తలు వచ్చాయి. అయితే ఈ ప్రచారాన్ని యూఏఈ అప్పట్లో ఖండించింది.
ఏండ్లుగా ఘర్షణలే
యెమెన్ అధ్యక్షుడు మన్సూర్ హదీ నేతృత్వంలోని ప్రభుత్వ బలగాలు, హౌతీ తిరుగుబాటుదారుల మధ్య ఘర్షణతో యెమెన్ ప్రజలు నలిగిపోతున్నారు. యూఏఈ కీలక భాగస్వామిగా ఉన్న సౌదీ అరేబియా నేతృత్వంలోని సంకీర్ణ కూటమి మన్సూర్ హదీ బలగాలతో కలిసి యెమెన్లో ఇరాన్ అనుకూల హౌతీ తిరుగుబాటుదారులపై 2015 నుంచి యుద్ధం చేస్తున్నది. ఈ నేపథ్యంలో సౌదీతో పాటు యూఏఈని కూడా తిరుగుబాటుదారులు లక్ష్యంగా చేసుకొని హౌతీ తిరుగుబాటుదారులు దాడులు చేస్తున్నారు. ఇటీవల యూఏఈకి చెందిన ఓ షిప్ను కూడా హౌతీ తిరుగుబాటుదారులు స్వాధీనం చేసుకొన్నారు. 2019లో యూఏఈ యెమెన్లో తన సైనిక ఉనికిని చాలా వరకు తగ్గించుకుంది. అయితే తాను శిక్షణ ఇచ్చిన సాయుధ యెమెన్ దళాల ద్వారా ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నది.