బంజారాహిల్స్, నవంబర్ 1: ఎస్సీ అట్రాసిటీ చట్టాన్ని అవహేళన చేసి దళితుల మనోభావాలను కించపరచిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్పై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జీ చెన్నయ్య సోమవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు రోజుల క్రితం తీన్మార్ మల్లన్నను జైల్లో కలిసేందుకు వెళ్లిన ఎంపీ అర్వింద్ మీడియాతో మాట్లాడుతూ.. తనమీదున్న ఎస్సీ అట్రాసిటీ కేసును ‘లొట్టపీసు కేసు’ అని అవహేళన చేశారు. దళితులకు రక్షణ కవచంగా పనిచేస్తున్న ఎస్సీ అట్రాసిటీ కేసు గురించి స్వయంగా ఓ ఎంపీ చులకనగా మాట్లాడడంతో దళితజాతి మనోభావాలు దెబ్బతిన్నాయని చెన్నయ్య తన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు ఈ ఫిర్యాదును స్వీకరించి విచారణ చేపట్టారు.
ఎంపీ అర్వింద్ దిష్టిబొమ్మ దహనం
మెట్పల్లి రూరల్, నవంబర్ 1: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులపై నిజామాబాద్ ఎంపీ అర్వింద్ అనుచిత వ్యాఖ్యలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతున్నది. సోమవారం జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వేంపేట అంబేద్కర్ యువన సంఘం నాయకులు స్థానిక బస్టాండు చౌరస్తా వద్ద అర్వింద్ దిష్టిబొమ్మను దహనం చేశారు. వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.