రాంచీ : చెరువులో మునిగి ఏడుగురు బాలికలు మృత్యువాతపడ్డారు. ఈ దుర్ఘటన జార్ఖండ్లోని లతేహార్ జిల్లాలో జరిగింది. సాంప్రదాయ పండుగ ‘కర్మ పూజ’ కోసం వెళ్లిన సమయంలో ఈ విషాదకర ఘటన చోటు చేసుకున్నది. ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బలుమఠ్ బ్లాక్లోని షేర్గఢ్ పంచాయతీ పరిధిలోని బుక్రు గ్రామంలో పది మంది బాలికలు గిరిజన పండుగ ‘కర్మ పూజ’ జరుపుకునేందు కోసం గ్రామ చెరువు వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదశాత్తు ఇద్దరు బాలికలు చెరువులో పడిపోయారు. రక్షించాలని కేకలు వేయడంతో వారిని కాపాడేందుకు వెళ్లి మరో ఐదుగురు మునిగిపోయారని అధికారులు తెలిపారు.
నలుగురు బాలికలు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురు బాలుమఠ్ ఆరోగ్య కేంద్రానికి తరలిస్తుండగా మార్గమధ్యలో కన్నుమూశారు. మృతుల్లో ముగ్గురు అక్కాచెళ్లెల్లు ఉన్నారు. మృతుల వయస్సు 12-20 సంవత్సరాల మధ్య ఉంటుందని, వీరంతా స్థానిక పాఠశాలలు, కళాశాలల్లో విద్యనభ్యసిస్తున్నారు. ఘటన నేపథ్యంలో గ్రామస్తులు 98వ జాతీయ రహదారిపై బైఠాయించారు. ఘటనపై సీఎం హేమంత్ సోరెన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చెరువులో మునిగి ఏడుగురు మృతి చెందారన్న వార్తతో షాక్కు గురయ్యాయని పేర్కొన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, బాధిత కుటుంబాలకు ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్ చేశారు.