ఆమ్స్టర్డామ్, అక్టోబర్ 3: 64 ఏండ్ల ఓ వృద్ధురాలికి 22 ఏండ్ల ప్రాయంలో అందాల్సిన పోస్ట్ కార్డు ఇప్పుడు చేరుతున్నది. అవును మీరు విన్నది నిజమే. తన చెల్లె 42 ఏండ్ల కింద రాసిన పోస్ట్కార్డు ఇప్పుడు చేతికి అందబోతుందని తెలిసి ఆ డచ్ వృద్ధురాలు సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నారు.
వెరోనికా, జాన్, మత్తిజ్స్ సంతకంతోకూడిన గ్రీటింగ్ కార్డును1980 వేసవిలో దక్షిణ ప్రావిన్స్లోని హోవెప్ నుంచి దక్షిణ ఆమ్స్టర్డామ్లోని న్యూ వెన్నెప్లోగల లుద్వినా, పీట్ వెర్హోవెన్కు పంపించారు. అయితే, ఆ ఉత్తరం వారికి చేరలేదు.
42 ఏండ్ల తర్వాత ఇప్పుడు సదరు పోస్ట్కార్డు మీకు అందబోతుందంటూ డచ్ పోస్ట్ ఆఫీస్ నుంచి సమాచారం అందడంతో లుద్వినా వెర్హోవెన్ ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ లెటర్పై సంతకం చేసిన తన చెల్లె భర్త, మరిది కాలం చేశారని లుద్వినా పేర్కొన్నారు. చిరునామా సరిగ్గా లేకపోవడంతో ఆ పోస్ట్కార్డు వేరేచోటుకు చేరవేశామని, ఇప్పటివరకూ అక్కడే ఉందని డచ్ పోస్ట్ ఆఫీస్ అధికారి తెలిపారు. ఆ పోస్ట్కార్డు ఇంకా చెక్కుచెదరలేదని, దాన్ని వెంటనే లుద్వినాకు అందజేస్తామని చెప్పారు.