ఆదిలాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆదిలాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) బేల బ్రాంచీలో గురువారం భారీ కుంభకోణం వెలుగుచూసింది. బ్యాంకులో పనిచేసే స్టాఫ్ అసిస్టెంట్ శ్రీపత్కుమార్ ఇతర ఉద్యోగులతో కలిసి భారీగా నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్టు డీసీసీబీ సీఈవో శ్రీధర్రెడ్డి తెలిపారు. ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం.. శ్రీపత్కుమార్ ఇతరుల ఐడీ, పాస్వర్డ్ను ఉపయోగించి డీసీసీబీ ప్రధాన కార్యాలయ హెడ్ అకౌంట్లో నుంచి తన బంధువులకు, తోటి ఉద్యోగులకు రూ.2.86 కోట్లు మళ్లించాడు. ఆన్లైన్లో వివిధ బ్యాంకులకు రుణాలు ఇచ్చినట్టు నమోదు చేశాడు. బ్యాంకులోని మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్లు కూడా తమ పాస్వర్డ్లతో ఈ డబ్బులను ఇతరుల ఖాతాల్లోకి అనుమతించారు. ఇటీవల ఆడిట్ నిర్వహించగా నిధులు దుర్వినియోగమైనట్టు వెల్లడైంది. వెంటనే డీజీఎం, ఇద్దరు ఏజీఎంలతో విచారణ జరిపించారు. విచారణ నివేదిక ఆధారంగా స్టాఫ్ అసిస్టెంట్ శ్రీపత్కుమార్ రూ.2.86 కోట్లను కాజేసినట్టు గుర్తించారు. ఇందులో ప్రమేయం ఉన్న శ్రీపత్కుమార్తోపాటు మరో పదిమంది అధికారులు, సిబ్బందిని సస్పెండ్ చేసినట్టు సీఈవో శ్రీధర్రెడ్డి తెలిపారు. అయితే సిబ్బంది, బంధువుల ఖాతాల్లో ఉన్న బ్యాంకు సొమ్ము రూ.60 లక్షలు ఫ్రీజ్ చేసినట్టు ఆయన పేర్కొన్నారు. సిబ్బందిపై శాఖాపరమైన కేసులు, క్రిమినల్ కేసులతోపాటు సీఐడీ విచారణ జరిపించనున్నట్టు తెలిపారు.