హైదరాబాద్ : రాష్ట్రంలో ఈ నెల 14న జరిగే గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల పోలింగ్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లపై అదనపు డీజీ, కలెక్టర్లు, ఎస్పీలు, రిటర్నింగ్ అధికారులతో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శశాంక్ గోయల్ మాట్లాడుతూ.. రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో 164 మంది అభ్యర్థులు పోటీలో ఉండటంతో ఈసారి 1,685 జంబో బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేసినట్లు చెప్పారు.
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ స్థానంలో మొత్తం 93 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు తెలిపారు. 9 జిల్లాల్లో మొత్తం 5,31,268 మంది ఓటర్లు ఉండగా 799 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఓటర్ స్లిప్పుల పంపిణీ పూర్తయిందన్నారు. ఈసారి పదిశాతం అదనంగా 880 జంబో బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ఒక్కో కేంద్రానికి 1,2 పెద్ద బ్యాలెట్ పెట్టెలు కూడా ఇస్తున్నామన్నారు. నగరంలోని సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో 8 హాళ్లలో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు తెలిపారు. ఓట్ల లెక్కింపునకు 56 టేబుళ్లు ఏర్పాటు చేసినట్లు, వీలైనంత త్వరగా లెక్కింపును పూర్తి చేయనున్నట్లు చెప్పారు.
నల్లగొండ-వరంగల్-ఖమ్మం స్థానంలో మొత్తం 71 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు తెలిపారు. 12 జిల్లాలో మొత్తం 5,05,565 మంది ఓటర్లు ఉండగా 731 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నియోజకవర్గానికి 805 జంబో బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. నల్లగొండ మార్కెటింగ్శాఖ గిడ్డంగిలో 8 హాళ్లలో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు తెలిపారు. ఓట్ల లెక్కింపునకు 56 టేబుళ్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
పోలింగ్ రోజు అభ్యర్థికి 2 వాహనాలకు మాత్రమే అనుమతి ఉందన్నారు. ప్రతి జిల్లాకు అదనంగా మరో వాహనానికి అనుమతిస్తున్నట్లు చెప్పారు. ఎన్నికలు సాఫీగా జరిగేలా అందరూ సహకరించాలని కోరారు. ఓటర్ల జాబితాపై ఫిర్యాదులను ఎప్పటికవప్పుడు పరిశీలించనున్నట్లు తెలిపారు. తప్పుడు సమాచారం ఇచ్చిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. పోలింగ్ సమయంలో కొవిడ్ నిబంధనలు పూర్తిస్థాయిలో అమలు చేస్తామన్నారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తే చర్యలు తప్పవన్నారు. అభ్యర్థులు ఓటు వేసేలా యాజమాన్యాలు అవకాశం ఇవ్వాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. పోలింగ్ కేంద్రాల్లో వీడియోగ్రఫీ కూడా చేయిస్తున్నట్లు పేర్కొన్నారు.