న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: దేశీ ఫార్మా సంస్థలు కొత్త ఉత్పత్తులు, పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ) ప్రక్రియపై భారీగా పెట్టుబడులు చేయనున్నందున, వచ్చే కొద్ది సంవత్సరాల్లో ఫార్మా పరిశ్రమ శరవేగంగా వృద్ధిచెందుతుందని ఇండియా బ్రాండ్ ఈక్విటీ ఫౌండేషన్ (ఐబీఈఎఫ్) తెలిపింది. ఈ కారణంగా 2021లో 42 బిలియన్ డాలర్లుగా ఉన్న భారత ఫార్మా మార్కెట్ 2024కల్లా 65 బిలియన్ డాలర్లకు, 2030కల్లా 120-130 బిలియన్ డాలర్లకు చేరుతుందని తాజా నివేదికలో అంచనా వేసింది. కొవిడ్-19 పాండమిక్తో ఫార్మా రంగంలో నవకల్పనలకు భారీ డిమాండ్ నెలకొనడమే కాకుండా, ఆర్ అండ్ డీ జోరందుకుందని, దీంతో ఈ కార్యకలాపాల్లో మరిన్ని పెట్టుబడులు చేయాలని ఫార్మా లీడర్లు భావిస్తున్నారన్నది. ఐబీఈఎఫ్ రిపోర్ట్ ప్రకారం ప్రపంచ ఫార్మా ఉత్పత్తి పరిమాణంలో భారత్ మూడోస్థానాన్ని ఆక్రమిస్తుండగా, విలువ రీత్యా 14వ స్థానంలో ఉంది. దేశంలో దాదాపు 3,000 ఔషధ కంపెనీలు, 10,500 ఉత్పత్తి యూనిట్లున్నాయి.
తాము పరిశోధనా కార్యకలాపాలపై తమ టర్నోవర్లో 10-12 శాతం వ్యయం చేస్తున్నామని డాక్టర్ రెడ్డీస్ లాబొరెటరీస్ కో చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జీవీ ప్రసాద్ తెలిపారు. ఈ బడ్జెట్లో మూడింట రెండొంతులు ప్రస్తుత వ్యాపారంపైన, ఒక వంతు బయోలాజిక్స్లో భవిష్యత్ వ్యాపారం కోసం ఖర్చుచేస్తున్నామన్నారు. మార్కెట్లో వినూత్న ఉత్పత్తులను విడుదల చేసేందుకు ప్రస్తుతం 7-9 శాతం మధ్య వ్యయపరుస్తున్నామని, వచ్చే ఐదేండ్లలో దీనిని 9-12 శాతానికి పెంచుతామని సన్ఫార్మా మేనేజింగ్ డైరెక్టర్ దిలీప్ సింఘ్వి తెలిపారు. వివిధ ఇనిస్టిట్యూట్ల సహకారంతో హైబ్రీడ్ కోర్సులను రూపొందించి, తమ సిబ్బంది నైపుణ్యాన్ని మెరుగుపర్చేందుకు కృషి చేస్తున్నామని, ఆర్ అండ్ డీ, నవకల్పనలపై వ్యయాల్ని ఐదేండ్లలో 10 శాతానికి పెంచుతామని జైడస్ క్యాడిల్లా చైర్మన్ పంకజ్ పటేల్ చెప్పారు.