‘19,024 అడుగుల ఎత్తు’దేనికి సంబంధించింది? (బి) ఎ) ఇటీవల గుర్తించిన అత్యంత ఎత్తయిన జలపాతం బి) అత్యంత ఎత్తులో ఉన్న మోటార్ రహదారి సి) అత్యంత ఎత్తులో ఉన్న యుద్ధ క్షేత్రం డి) అత్యంత ఎత్తులో నిర్మించిన విమానాశ్రయం వివరణ: ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో మోటార్లు తిరిగేందుకు బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ నిర్మించింది. ఇది గిన్నిస్ బుక్లో స్థానం సంపాదించింది. ఈ రహదారి 19,024 అడుగులో ఎత్తులో ఉంది. లఢక్లోని ఉమ్లింగ్ లా కనుమలో దీనిని నిర్మించారు. 52 కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ రహదారి చిస్ముల్ నుంచి డెమ్చోక్ టర్మాక్ను కలుపుతుంది. ఈ రహదారికి ముందు ప్రపంచంలో అత్యంత ఎత్తయిన రహదారి బొలీవియాలో ఉంది. ఆ దేశంలో ఉటురం అనే అగ్నిపర్వతాన్ని కలిపే రహదారి 18,953 అడుగుల ఎత్తులో ఉంది.
బీఎస్ఎఫ్ తనిఖీ పరిధిని పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేసిన తొలి రెండు రాష్ర్టాలు ఏవి? (డి)
కేరళ 2. రాజస్థాన్
పంజాబ్ 4. పశ్చిమబెంగాల్ ఎ) 1, 2 బి) 1, 3 సి) 2, 4 డి) 3, 4 l వివరణ: సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) తనిఖీలు చేసే ప్రాదేశిక పరిధిని పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పశ్చిమబెంగాల్ శాసనసభ నవంబర్ 16న తీర్మానం చేసింది. పంజాబ్ తర్వాత ఈ తీర్మానం చేసిన రెండో రాష్ట్రం ఇదే. అంతర్జాతీయ సరిహద్దులు ఉన్న పంజాబ్, పశ్చిమబెంగాల్, అసోం రాష్ర్టాల్లో బీఎస్ఎఫ్ తనిఖీలు చేసే ప్రాదేశిక పరిధిని 15 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల వరకు పెంచుతూ కేంద్రం చట్టం చేసింది.
సంహతి అనే ప్రాజెక్ట్ దేనికి సంబంధించింది? (సి) ఎ) పర్యావరణ పరిరక్షణ బి) జలవనరుల పరిరక్షణ సి) గిరిజన భాషల్లో విద్య అందించడం డి) ఏనుగులకు ప్రత్యేక ప్రదేశాల ఏర్పాటు వివరణ: ఒడిశా రాష్ట్రంలో వేర్వేరు గిరిజన భాషల్లో విద్యను అందించేందుకు సంహతి అనే కొత్త ప్రాజెక్ట్ను ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇప్పటికే 21 గిరిజన భాషల్లో 302 పాఠ్యపుస్తకాలు, 2500 అదనపు స్టడీ మెటీరియల్ను, కథల పుస్తకాలను అభివృద్ధి చేశారు. భువనేశ్వర్లోని ‘షెడ్యూల్డ్ క్యాస్ట్-షెడ్యూల్డ్ ట్రైబ్స్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అండ్ ది అకాడమీ ఆఫ్ ట్రైబల్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ సంహతి ప్రాజెక్ట్ను అమలు చేస్తుంది. మొత్తం 21 భాషల్లో కేవలం ఒకటి మాత్రమే ఎనిమిదో షెడ్యూల్లో ఉంది. అది సంతాలి.
అధికరణం 245 దేనికి సంబంధించింది? (ఎ) ఎ) పార్లమెంట్ చేసిన చట్టాన్ని ఉపసంహరించడం బి) కేంద్ర, రాష్ట్ర, ఉమ్మడి జాబితా సి) పార్లమెంట్ నిర్వచనం డి) వ్యవసాయ అంశాలు వివరణ: రాజ్యాంగంలో పదకొండో భాగంలో 245వ అధికరణం ఉంటుంది. దీని ప్రకారం భారత దేశం అంతటికీ లేక కొంత భాగానికి శాసనాలు చేసే అధికారం పార్లమెంట్కు ఉంది. రాష్ట్రమంతటికీ లేదా కొంత భాగానికి విస్తరించే శాసనాన్ని చేసే అధికారం ఆయా రాష్ర్టాల శాసనసభలకు కూడా ఉంటాయి. అలాగే ఈ అధికరణం ప్రకారం చేసిన చట్టాలను రద్దు చేసే అంశం కూడా ఈ ఆర్టికల్ ప్రకారమే జరుగుతుంది. గతేడాది పార్లమెంట్ చేసిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కేంద్రం నిర్ణయించిన నేపథ్యంలో ఈ ఆర్టికల్ ప్రస్తుతం వార్తల్లో నిలిచింది.
కింది వాటిలో సరికానిది? (డి) ఎ) రైతు ఉత్పత్తుల వాణిజ్య, వ్యాపార (ప్రోత్సాహక, సులభతర) చట్టం బి) ధరల హామీ, వ్యవసాయ సేవలపై రైతుల (సాధికారత, రక్షణ) ఒప్పంద చట్టం సి) నిత్యావసర సరకుల (సవరణ) చట్టం డి) రైతుల ఆదాయ రెట్టింపు (హామీ) చట్టం- 2020 వివరణ: గతేడాది మూడు సాగు చట్టాలను పార్లమెంట్ చేసింది. మొదట 2020, జూన్ 5న ఆర్డినెన్స్ రూపంలో ప్రవేశపెట్టారు. అదే ఏడాది సెప్టెంబర్ 17న లోక్సభ, సెప్టెంబర్ 27న రాజ్యసభ ఆమోదించాయి. రాష్ట్రపతి సెప్టెంబర్ 27న ఆమోదం తెలిపారు. అయితే ఈ చట్టాలపై రైతులు తీవ్ర స్థాయిలో వ్యతిరేకించారు. కనీస మద్దతు ధర వ్యవస్థకు ఈ చట్టం ముగింపు పలుకుతుందని రైతులు ఆందోళన చెందారు. ప్రైవేట్ సంస్థలు దోచుకుంటాయని కూడా భావించారు. కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనం చేకూర్చేలా ఉందంటూ తీవ్ర స్థాయిలో ఉద్యమించారు. దీంతో కేంద్రం వీటిని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది.
ప్రపంచ బ్యాంక్ తాజా నివేదిక ప్రకారం ప్రపంచంలో రెమిటెన్స్లలో అగ్రస్థానంలో ఉన్న దేశం? (సి) ఎ) చైనా బి) అమెరికా సి) భారత్ డి) ఫిలిప్పీన్స్ వివరణ: రెమిటెన్స్లను పొందడంలో ప్రపంచంలోనే భారత్ అగ్రస్థానంలో ఉంది. ఈ మేరకు ప్రపంచ బ్యాంక్ ఒక నివేదికను విడుదల చేసింది. దీని పేరు ‘మైగ్రేషన్ అండ్ డెవలప్మెంట్ బ్రీఫ్ 35’. భారత్ తర్వాతి స్థా నాల్లో చైనా, మెక్సికో, ఫిలిప్పీన్స్ దేశాలు నిలిచాయి. 2021లో భారత్ 87బిలియన్ అమె రికన్ డాలర్ల రెమిటెన్స్లను స్వీకరించింది.
కింది వాటిలో భిన్నమైన దానిని గుర్తించండి? (బి) ఎ) దక్షిణ గంగోత్రి బి) ధాత్రి సి) మైత్రి డి) భారతి వివరణ: దక్షిణ గంగోత్రి, మైత్రి, భారతి ఇవన్నీ అంటార్కిటికాలో భారత దేశం నెలకొల్పిన పరిశోధన కేంద్రాలు. ఇందులో మొదటిది దక్షిణ గంగోత్రి 1983లోనే ప్రారంభమైంది. ప్రస్తుతం ఇక్కడ సేవలు నిలిచిపోయాయి. మైత్రిని 1988లో, భారతిని 2012లో అందుబాటులోకి తెచ్చారు. అంటార్కిటికా ఖండంలో ఉన్న ఆయా కేంద్రాల్లో భారత్ పరిశోధనలు చేస్తూ ఉంటుంది. ఇటీవల భారత్ నుంచి శాస్త్రజ్ఞుల బృందం 41వ శాస్త్ర పరిశోధనకు వెళ్లింది. అంటార్కిటికా కార్య్రక్రమాన్ని భారత్ 1981లోనే ప్రారంభించింది. ఇందుకుగాను గోవాలో నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రిసెర్చ్ను కూడా ప్రారంభించారు.
ప్రథమ్ అనే స్వచ్ఛంద సంస్థను ఏ సంవత్సరంలో ప్రారంభించారు? (డి) ఎ) 1992 బి) 1993 సి) 1994 డి) 1995 వివరణ: సంవత్సర విద్యా స్థితి (యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్)ని ఏటా ప్రథమ్ అనే స్వచ్ఛంద సంస్థ విడుదల చేస్తుంది. దీనిని 1995లో ఏర్పాటు చేశారు. 2021కు గాను ఈ సంస్థను ఇందిరాగాంధీ నిరాయుధీకరణ, అభివృద్ధి పురస్కారానికి ఎంపిక చేశారు. ఈ సంస్థను మాధవ్ చవాన్, ఫరీదాలాంబే ఏర్పాటు చేశారు. దేశంలోనూ, ప్రపంచ వ్యాప్తంగా పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఈ సంస్థ కృషి చేస్తుంది. ప్రతి చిన్నారి బడిలో ఉండాలని, నాణ్యమైన విద్యను అభ్యసించాలన్న ప్రధాన లక్ష్యంతో పనిచేస్తుంది. మొదట ముంబయి మురికివాడల్లో బాల్వాడీలు, ప్రీ-స్కూళ్లను ఏర్పాటు చేసి తర్వాత తన సేవలను విస్తరించింది.
స్వచ్ఛ సర్వేక్షణ్ రాష్ర్టాల ర్యాంకుల్లో తెలంగాణ ఎన్నో ర్యాంక్లో నిలిచింది? (సి) ఎ) 18 బి) 6 సి) 11 డి) 15 వివరణ: స్వచ్ఛ సర్వేక్షణ్ రాష్ర్టాల ర్యాంకుల్లో గతేడాది 18వ స్థానంలో ఉన్న తెలంగాణ ఈ ఏడాది 11వ ర్యాంక్ దక్కించుకుంది. 40 లక్షలకుపైగా జనాభా ఉన్న నగరాల్లో ‘స్వయం సమృద్ధి మెగా నగరంగా గ్రేటర్ హైదరాబాద్ నిలిచింది. రాష్ట్రంలోని పలు జిల్లాలు, మున్సిపాలిటీలకు అవార్డులు దక్కాయి. సఫాయి మిత్ర సురక్ష చాలెంజ్ విభాగంలో రెండో స్థానంలో తెలంగాణ నిలిచింది. ఇదే విభాగంలో 3 లక్షల్లోపు జనాభా ఉన్న నగరాల్లో కరీంనగర్ జాతీయ స్థాయిలో ద్వితీయ స్థానంలో ఉంది. పది లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల విభాగంలో హైదరాబాద్ 13వ స్థానంలో నిలిచింది. లక్ష నుంచి 10 లక్షల జనాభా ఉన్న నగరాల్లో కరీంనగర్ 74, రామగుండం 92 స్థానాల్లో నిలిచాయి. జిల్లా ర్యాంకుల్లో హైదరాబాద్ జిల్లా 6, సిరిసిల్లా 80, పెద్దపల్లి 117, కరీంనగర్ 139వ ర్యాంక్ సాధించాయి.
ప్రేరక్ దౌర్ సమ్మాన్ అవార్డ్ల్లో గోల్డ్ విభాగంలో స్థానం పొందిన తెలంగాణ నగరాలు ఏవి? (డి) ఎ) సికింద్రాబాద్, నిజామాబాద్ బి) హైదరాబాద్, వరంగల్ సి) హైదరాబాద్, కరీంనగర్ డి) హైదరాబాద్, సిద్దిపేట వివరణ: వ్యర్థాలతో తడి, పొడి, ప్రమాదకరమైనవి విభజించడం, వేర్వేరుగా శుద్ధిచేసి రీసైక్లింగ్ చేయడం నిర్మాణ, కూల్చివేత వ్యర్థాలను వేరు చేయడం, నగరాల్లో పారిశుద్ధ్య పరిస్థితుల ఆధారంగా ‘ప్రేరక్ దౌర్ సమ్మాన్’ పేరిట ఈసారి అవార్డ్లు ఇచ్చారు. ఇందులో ప్లాటినం, గోల్డ్, బ్రాంజ్, కాపర్ విభాగాల్లో అవార్డ్లు తెలంగాణ నుంచి ఎన్నో నగర పాలికలు పొందాయి. గోల్డ్ విభాగంలో 151 నగరాల్లో గ్రేటర్ హైదరాబాద్, సిద్దిపేట చోటు దక్కించుకున్నాయి. సిల్వర్ విభాగంలో 67 నగరాల్లో నిజాంపేట, బడంగ్ పేట్, సికింద్రాబాద్ కంటోన్మెంట్లు నిలిచాయి. కాంస్యం విభాగంలో 143 నగరాల్లో భూపాలపల్లి, నాగరం పురపాలక సంఘాలకు చోటు దక్కింది.
దేశంలో చేప, రొయ్య పిల్లలను ఉచితంగా జలాల్లో విడుదల చేస్తున్న ఏకైక రాష్ట్రం ఏది? (బి) ఎ) మధ్యప్రదేశ్ బి) తెలంగాణ సి) హర్యానా డి) గుజరాత్ వివరణ: మంచినీటి చేపల ఉత్పత్తిలో, తీరం లేని రాష్ర్టాల్లో తెలంగాణకు ఉత్తమ పురస్కారం దక్కింది. ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా నవంబర్ 21న ఈ పురస్కారాన్ని రాష్ట్రం అందుకుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా అన్ని నీటి వనరుల్లో ఉచితంగా చేప, రొయ్య పిల్లలను విడుదల చేస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. 2014-15 తెలంగాణ ఆవిర్భవించినప్పుడు రాష్ట్రంలో 2.27 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి ఉండగా, ప్రస్తుతం 3.37 లక్షల టన్నులకు పెరిగింది. వినియోగదారులకు చేపలను అందుబాటులోకి తెచ్చేందుకు 150 సంచార చేపల విక్రయ వాహనాలను కూడా ప్రారంభించారు.
లాల్ సలామ్: ఏ నావెల్ అనే పుస్తకాన్నిరచించింది ఎవరు? (సి) ఎ) దేబాశిష్ ముఖర్జీ బి) బాన్ కీ మూన్ సి) స్మృతి ఇరానీ డి) సయ్యద్ అక్బరుద్దీన్ వివరణ: లాల్ సలామ్: ఏ నావెల్ అనే పుస్తకాన్ని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ రచించారు. ఏప్రిల్ 2010లో 76 సీఆర్పీఎఫ్ దళాలను హత్య చేసిన వైనం నేపథ్యంగా ఈ పుస్తక రచన సాగింది. అలాగే దేబాశిష్ ముఖర్జీ ఇటీవల ‘ది డిస్రప్టర్: హౌ విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ షూక్ ఇండియా’ అనే పుస్తకాన్ని రచించారు. భారత ఎనిమిదో ప్రధాని వీపీ సింగ్ నేపథ్యంగా ఇది సాగుతుంది. ఐక్యరాజ్య సమితి మాజీ సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ ‘రిజాల్వ్డ్: యునైటెడ్ నేషన్స్ ఇన్ ఏ డివైడెడ్ వరల్డ్’ అనే పుస్తకాన్ని రచించారు. ఐక్యరాజ్య సమితి భారత మాజీ శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ ‘ఇండియా వర్సెస్ యూకే: ది స్టోరీ ఆఫ్ యాన్ అన్ప్రెసిడెంటెడ్ డిప్లొమాటిక్ విన్’ అనే పుస్తకాన్ని రచించారు.
గోప్యత అనేది ఏ ప్రాథమిక హక్కులో భాగం అని సుప్రీంకోర్ట్ తీర్పు చెప్పింది? (డి) ఎ) ఆర్టికల్ 14 బి) ఆర్టికల్ 19 సి) ఆర్టికల్ 16 డి) ఆర్టికల్ 21 వివరణ: గోప్యత అనేది అధికరణం 21లో భాగంగా ఉండే ప్రాథమిక హక్కు అని 2017 ఆగస్ట్లో సుప్రీంకోర్ట్ తీర్పు చెప్పింది. దీనిని కాపాడాలని చెప్పడంతో జస్టిస్ బీఎన్ శ్రీకృష్ణ నేతృత్వంలో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. అలాగే వ్యక్తిగత సమాచారానికి సంబంధించి 2019లో ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి వ్యక్తిగత సమాచార రక్షణ బిల్లును పార్లమెంట్ శీతాకాల సమావేశంలో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సమాయత్తం అవుతుంది.
భారత్ గౌరవ్ అనేది కింది వాటిలో ఏ మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రారంభించింది? (బి) ఎ) రక్షణ మంత్రిత్వ శాఖ బి) రైల్వే మంత్రిత్వ శాఖ సి) విదేశాంగ వ్యవహారాల శాఖ డి) శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ వివరణ: పర్యాటకం ద్వారా ఆదాయాన్ని ఆర్జించేందుకు భారత రైల్వే మంత్రిత్వ శాఖ ‘భారత్ గౌరవ్’ను ప్రారంభించింది. దీనిలో ఇతిహాస ఆధారిత పర్యాటక రైళ్లను ప్రవేశపెడతారు. ఇటీవల రామాయణ్ ఎక్స్ప్రెస్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రైవేట్ లేదా ప్రభుత్వ ఆపరేటర్ల ద్వారా ఈ రైళ్లను కొనసాగిస్తారు. ఇప్పటి వరకు రైల్వే వ్యవస్థలో కేవలం ప్రయాణికులు, సరకు రైళ్లు మాత్రమే ఉండేవి, తాజాగా మూడో విభాగం కూడా అందుబాటులోకి వచ్చింది.