మన ఆధ్యాత్మికశక్తి ప్రపంచానికే స్ఫూర్తి
హరిత విప్లవంతో స్వయం సమృద్ధి సాధించాం
చీకట్ల నుంచి మిగులు విద్యుత్కు వచ్చాం
శాస్త్ర సాంకేతిక రంగాల్లో యువ భారతీయులుండడం గర్వకారణం
‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్’లో పాల్గొనడం సంతోషంగా ఉంది
గవర్నర్ తమిళిసై సౌందర రాజన్
నగరంలోని పరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండా ఆవిష్కరణ
ఉత్సవాలు ఘనంగా ప్రారంభం
హన్మకొండ, మార్చి 12 : చారిత్రక నగరం వరంగల్లో ‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్’ను ప్రారంభించడం ఆనందంగా ఉందని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 74ఏళ్లు పూర్తయి, 75వ వసంతంలోకి అడుగిడుతున్న సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తలపెట్టిన ‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్’ను నగరంలోని పరేడ్ గ్రౌండ్లో శుక్రవారం ఆమె అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం సిద్ధించినప్పటి నుంచి ఇప్పటివరకు దేశం సాధించిన విజయాలు, దేశ ఆర్థిక అభివృద్ధి, చేపట్టాల్సిన సమీకరణాలు, కరోనాను అరికట్టడంలో దేశం సాధించిన విజయం గురించి వివరించారు. చారిత్రక ఘట్టానికి సంబంధించిన వేడుకలలో తాను భాగస్వామి కావడం ఆనందంగా ఉందన్నారు. స్వతంత్ర భారతం 75వ ఏట అడుగిడుతున్న శుభతరుణం చిరస్థాయిలో నిలిచిపోయే మధురానుభూతులు నిలుపుకొనేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు.
శాస్త్ర సాంకేతిక రంగాల్లో యువ భారతీయుల పాత్ర చాలా ఉన్నదని, ఇది మనకు గర్వకారణమన్నారు. ప్రపంచంలోని చాల దేశాల్లో యువ శాస్త్రవేత్తలు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, నిపుణుల కొరత ఉందని, మన దేశం మాత్రం 1.3 బిలియన్ జనాభాతో అత్యున్నత శక్తిగా ఆవిర్భవిస్తున్నదని చెప్పారు. మన భారతం ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ వైపు దూసుకుపోతున్నదని, ఇందులో యువతకు అత్యంత ప్రాధాన్యత ఉండే అవకాశాలున్నాయని చెప్పారు. దేశం కోసం ప్రాణాలర్పించిన వీరులను, స్వాతంత్య్ర సమరయోధులను కార్యక్రమంలో స్మరించారు. ఈ సందర్భంగా త్రివర్ణ బెలూన్లను ఎగురవేశారు. అనంతరం ఫొటో ఎగ్జిబిషన్ను సందర్శించారు. కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ బండా ప్రకాశ్, ఎంపీ పసునూరి దయాకర్, పోలీస్ కమిషనర్ ప్రమోద్కుమార్, కలెక్టర్ రాజీవ్గాంధీహన్మంతు, మేయర్ గుండా ప్రకాశ్రావు, జడ్పీ చైర్మన్ ఎం.సుధీర్కుమార్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, చల్లా ధర్మారెడ్డి, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, నగర కమిషనర్ పమేలా సత్పతి, ఇన్చార్జి డీసీపీ కే పుష్ప, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, డీఆర్వో వాసుచంద్ర పాల్గొన్నారు.
దేశ ప్రగతిలో తెలంగాణ కీలక పాత్ర
దేశ ప్రగతిలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తున్నదని, ఏడున్నర దశాబ్దాల కాలంలో దేశం అన్ని రంగాల్లో పురోగతి సాధించిందని గవర్నర్ పేర్కొన్నారు. కొవిడ్ వాక్సిన్కు రూపకల్పన చేసి ప్రపంచానికి మన దేశం దిశా నిర్దేశం చేసిందన్నారు. వాక్సిన్ను 50దేశాలకుపైగా సరఫరా చేయడం భారతీయులు గర్వించే విషయమన్నారు. దేశంలో ఇప్పటివరకు 2.5కోట్ల మందికి టీకాలు పంపిణీ చేసినట్లు చెప్పారు. మన దేశ ఆధ్యాత్మిక శక్తి ప్రపంచానికి స్ఫూర్తిదాయకమన్నారు. హరిత విప్లవం ద్వారా ధాన్యాల దిగుమతి చేసుకొనే స్థాయి నుంచి స్వయం సమృద్ధి సాధించామన్నారు. విద్యుత్ రంగంలో చీకట్లో మగ్గే రోజుల నుంచి విద్యుత్ మిగులు సాధించుకోగలిగే స్థాయికి చేరుకున్నామన్నారు.
చాయాచిత్ర ప్రదర్శన
కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖ, రీజినల్ ఔట్ రీచ్ బ్యూరో హైదరాబాద్ ఆధ్వర్యంలో పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన చాయచిత్ర ప్రదర్శనను గవర్నర్ సౌందర రాజన్ ప్రారంభించా రు. ప్రతి ఫొటోను ఆసక్తిగా చూశారు. దండి మార్చ్ మొదలు స్వాతంత్య్ర పోరాట ఘట్టాలను చాటిచెప్పే అరుదైన చిత్రాలతో ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్ ఆకట్టుకుందని ప్రశంసించారు. అలాగే కొవిడ్ డిజిటల్ ప్రచార వాహనాలను సైతం గవర్నర్ తిలకించారు. ఇక్కడ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ దక్షిణ భారతదేశ డైరెక్టర్ జనరల్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా స్వాతంత్య్ర పోరాట ఘట్టాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇక్కడ రీజినల్ ఔట్ రీచ్ బ్యూరో అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ మానస్, కృష్ణకాంత్, ఆర్వోబీ అధికారులు శ్రీదేవి, శ్రీనివాస్ ఉన్నారు.
సైకిల్పై వచ్చిన చీఫ్ విప్
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ప్రారంభానికి బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి పోలీస్హెడ్ క్వార్టర్స్ వరకు ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ సైకిల్పై వెళ్లి గవర్నర్కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరంగల్ నగరాన్ని కాలుష్యరహితంగా మార్చడంలో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు సైకిల్పై వచ్చినట్లు చెప్పారు. ఆజాది కా అమృత్ దేశమంతటా 75వారాలపాటు కొనసాగుతుందని, ఉత్సవాలకు కేసీఆర్ రూ.25కోట్లు కేటాయించారని, తెలంగాణలో హైదరాబాద్ తర్వా త వరంగల్లోనే ఈ వేడుకలు నిర్వహిస్తున్నామని చెప్పారు.