బద్ధకస్తులను, ఏ పనీ చేతగాని వారినీ, అసమర్థులనూ ఉద్దేశించి చెప్పిన చక్కటి సామెత ఇది. ఇటువంటి స్వభావం ఉన్న వ్యక్తులు పేరుకు పెత్తనం చేస్తుంటారు. కానీ, ఏ పనీ చేయలేరు, చేతకాదు కూడా. ఎందుకంటే, అతను తినే అన్నంలో రాయి వస్తేనే ‘ఆఁ ఏమవుతుందిలే! ఒక్క రాయేగా!!’ అని బద్ధకంతో పట్టించుకోడు. అలాంటి వ్యక్తి రేపు ఏదైనా పెద్ద ఆపద వస్తే, దాన్ని ఎదుర్కోగలడా? ఇటువంటి వారిపై నమ్మకం పెట్టుకోవద్దని సున్నితంగా హెచ్చరిస్తూ ‘తినే కూట్లో రాయి తీయలేనోడు ఏట్లోని రాయి తీస్తడా?’ అన్న సామెత ప్రయోగించారు. ఇలాంటి వారి పనితనం తెలిసిన తర్వాత, వారికిచ్చే మర్యాద కూడా వేరేగా ఉంటుంది.
‘ఒర్రే నోరాగది…తిరిగే కాలాగది’
కొండెపు మాటలు/ అబద్ధాలు చెప్పేవారి నోరు ఆగదు. వారి నోటిలో మాట నిల్వదు, చెడు తిరుగుళ్లు తిరిగే వారి బుద్ధి మారదు.. అని హితబోధ చేసే సందర్భంలో చెప్పే సామెత ఇది. ‘ఒర్రే నోరాగది.. తిరిగే కాలాగది’. ఇలాంటి వ్యక్తులకు ఎంత మంచి చెప్పినా ప్రవర్తన మార్చుకోరు. నోరు పారేసుకుంటూనే ఉంటారు. అలాగే, చెడు తిరుగుళ్లు తిరిగేవాళ్లను ఎంత హెచ్చరించినా బద్ధి మాత్రం మార్చుకోరు. ఆ సమయానికి ‘సరే’ అని చెప్పినా, కుక్కతోక వంకర అన్న చందాన మళ్లీ పాత తిరుగుళ్లు మొదలుపెడతారు. కాలమే వారికి బుద్ధి చెప్పాలి గానీ, తాము మాత్రం మారడానికి ఏ కోశానా ప్రయత్నించరు. అందుకే పెద్దలు ‘ఒర్రే నోరాగది…తిరిగే కాలాగది’ అన్నారు.
‘ఏమ్రా.. నీకేమైనా ‘నాలిక షేర్లు’ అయినయా?’
‘ఏమిరా బిడ్డా! ‘నాలిక షేర్లు’ అయినయా?.. సరిగా తింటలేవు.. పంటలేవు’ అని అనారోగ్యంగా ఉన్న పిల్లలను ఉద్దేశించి అడుగుతుంటారు పెద్దలు. నాలికపై పుండ్లు అయినా, గొంతులో వాపు వచ్చినప్పుడు పిల్లలు సరిగా అన్నం తినరు. అందుకే నాల్క షేర్లు అయినయ్ అంటారు. ఈ పదబంధం ఎక్కువగా వాడేది పల్లెల్లోనే. నాలిక షేర్లు అనే పదం ఎడ్లు, ఆవులు, గేదెలు సరిగా గడ్డిమేయనప్పుడు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. నాలిక షేర్లు రావడం అంటే ఆవులు, ఎడ్లు అనారోగ్యానికి గురవడం. ఈ పరిస్థితిని గమనించిన రైతులు వాటి నాలిక కింద ఉన్న రక్తనాళాలను సూదితో గుచ్చి చెడు రక్తం తీసేస్తారు. తర్వాత దొడ్డు ఉప్పులో కొద్దిగా పసుపు కలిపి నాలుకకు ఇరు వైపులా రాస్తారు. ఇలా చేసిన కొద్దిరోజుల్లోనే వాటి ఆరోగ్యం కుదుటపడుతుంది. మనుషుల విషయంలో ఈ వైద్యం పనికిరాదనుకోండి. వైద్యుడి సలహా మేరకు మందులు వాడాల్సిందే!
ఎచ్చాలు ఏసినవా?
బొమ్మలు: మృత్యుంజయ్
‘ఏమోయ్.. మాంసం కూరల ఎచ్చాలు ఏసినవా? ఆసన అత్తలేదు..’ అనే పదబంధం మొగుడూ పెండ్లాల మధ్య ఎక్కువగా వినిపిస్తుంది. ఎందుకంటే ఇంట్లో నీసు (మాంసం) కూర ఉంటే, అందులో కచ్చితంగా ఎచ్చాలు పడాల్సిందే. అప్పుడే కూర ఘుమఘుమలాడుతుంది. కమ్మటి వాసన వస్తుంది. ఎచ్చాలు అంటే మసాలా దినుసులు, గరం మసాలా అని అర్థం. ధనియాలు, లవంగాలు, యాలకులు, మార్వాడీ మొగ్గ, దాల్చిన చెక్క తదితర సుగంధ ద్రవ్యాలను కొద్దిగా వేయించి రోట్లో దంచి కూరలో వేస్తే ఆ వాసన వాడకట్టంతా గుప్పుమనాల్సిందే! ఈ మసాలా దినుసుల కలయికను ఎచ్చాలు అంటారు. వీటిని పొడిగొట్టి చేసుకునే మిశ్రమాన్ని వెచ్చమనీ, ఎచ్చమనీ పిలుస్తారు.
డప్పు రవి