‘గుమ్మన్నగారి పద్యాలు వింటే గుమ్మపాలు తాగినట్టు ఉంటుంది’.. ప్రపంచ తెలుగు మహాసభల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్య ఇది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆ మాటకొస్తే తెలంగాణలో ‘గుమ్మన్నగారి’ గురించి తెలియని సాహితీ అభిలాషి ఉండరు. అవధాన సరస్వతిగా, ఉత్తమ ఉపాధ్యాయుడిగా గుమ్మన్నగారి లక్ష్మీనరసింహ శర్మ తెలుగు భారతికి వెలుగు హారతి వంటివారు. దుబ్బాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మన ముఖ్యమంత్రికి పాఠాలు చెప్పిన గురువు కూడా. 33 ఏండ్ల బోధనా వృత్తిలో ప్రతి విద్యార్థి పేరునూ, నేపథ్యాన్ని గుర్తు పెట్టుకున్న వాత్సల్య సింధువు. నిజాయతీకి, నిరాడంబరతకు మరో రూపం. ఇదంతా ఒక ఎత్తు అయితే ప్రసార, ప్రచార సాధనాలు, రవాణా సౌకర్యాలు లేని ఆనాటి రోజుల్లోనే తెలంగాణలో ఏకంగా 330 అష్టావధానాలు చేసిన సాటిలేని మేటి కవి గుమ్మన్నగారి లక్ష్మీనరసింహ శర్మ. అవధానాల సంఖ్యలో ఆయనది చెరిగిపోని రికార్డు!
సిద్దిపేట ప్రాంతానికి చెందిన ప్రసిద్ధ సాహితీవేత్తల్లో లక్ష్మీనరసింహ శర్మ ఒకరు. ఆయన కన్నుమూసి దశాబ్దం గడిచింది. ఆయన అవధానాలు చేసిన కాలంలో (1956-96) ప్రచార ఆర్భాటాలు లేవు. దాంతో ఆయన ప్రతిభకు రావాల్సినంత గుర్తింపు రాలేదు. తన తండ్రిగారి అవధాన జీవన జ్ఞాపకాల్ని గ్రంథస్థం చేయాలనుకున్నారు గుమ్మన్నగారి కుమారుడు బాల శ్రీనివాసమూర్తి. ‘జీవన హిందోళం’ పేరుతో ఆ అవధాన శిరోమణి ‘ఆత్మకథనాత్మక జీవిత చరిత్ర’ (ఆటో బయోగ్రఫికల్
బయోగ్రఫీ)ను రచించారు.
గుమ్మన్నగారి అవధానం సెకెన్ల ముల్లుతో పోటీ పడుతూ సాగేది. ఆ పద్య ఆలాపన అపురూపమనీ, అనుభూతి సుందరంగా ఉండేదనీ ఆయన అవధానాలు చూసినవారు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. ఈ అవధానికి ఇష్టమైన రాగం హిందోళం. మనసుకు ఆహ్లాదాన్నిచ్చే రాగాల్లో ఇదీ ఒకటి. ఆయనకూ ఆ రాగానికీ కుదిరిన అనుబంధం.. 77వ ఏట శర్మగారు కన్నుమూసే వరకూ కొనసాగింది. అందుకే ఈ పుస్తకానికి ‘జీవన హిందోళం’ అని నామకరణం చేశారు రచయిత.
ఈ గ్రంథంలో తన తండ్రి జీవన విశేషాలతోపాటు ఆనాటి తెలంగాణ సామాజిక, సాహిత్య అంశాల్నీ ప్రస్తావించారు శ్రీనివాసమూర్తి. సిద్దిపేట వంటి చిన్న పట్టణంలో నిండుగా ఆవరించిన కవితా వాతావరణం, అవధానాలపై పండితులతోపాటు నిరక్షరాస్యులు చూపిన ఆసక్తి, అవధాన వేదికల మీద లక్ష్మీనరసింహ శర్మగారు పదర్శించిన ప్రతిభాస్ఫూర్తి .. అన్నీ కండ్లకు కట్టారు. 144 పేజీల ఈ పుస్తకం ఆద్యంతం హిందోళ రాగమంత మధురంగా సాగిపోయిందనడంలో సందేహం లేదు. ఎంతో మంది తెలంగాణ సాహితీవేత్తలు నేడు భౌతికంగా లేరు. వారి జ్ఞాపకాలు మాత్రం పదిలంగా ఉన్నాయి. వాటిని గ్రంథస్థం చేయగలిగే వారసులున్నారు. మరింతమంది ప్రతిభా మూర్తుల జ్ఞాపకాలు గ్రంథస్థం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
జీవన హిందోళం
గుమ్మన్నగారి లక్ష్మీనరసింహ శర్మగారి
జీవితం – అవధానం
రచన: గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి
పేజీలు: 144, వెల: రూ.58
ప్రతులకు: 98669 17227
శ్రీ కాశీ విశ్వనాథ సర్వస్వమ్
కాశీ విశ్వనాథుడి విశేషాలను గేయరూపంలో అందమైన స్తోత్రాలుగా మలిచిన కృతి ఇది. నిత్య పారాయణ గ్రంథంగా అందించారు కృతి కర్త. కాశీ యాత్ర వైభవం, శివ సభ, శివాని అనుగ్రహ స్తోత్రం, వారణాసి వైభవ స్తోత్రం, శివతాండవ స్తోత్రం.. సరళమైన గేయాల రూపంలో పొందుపరిచారు.
కృతికర్త: వేలేటి గౌరీశంకర శర్మ
పేజీలు: 160, వెల: అమూల్యం
ప్రతులకు: ఫోన్: 99128 92391
సినారెకు అక్షర నీరాజనం
‘లక్ష ప్రాణాలను ఆర్పేసిన కత్తి/ ఒక్క ఊపిరిని వెలిగిస్తుందా?/ ఉర్వీతలాన్ని వణికించే శక్తి/ ఒక్క హృదయాన్ని జయిస్తుందా?’ అంటూ మానవతావాదానికి మాత్రా ఛందస్సులో పట్టంకట్టిన మహాకవి ఆచార్య సింగిరెడ్డి నారాయణ రెడ్డి. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో ఆచార్య పీఠం మొదలుకొని, జ్ఞానపీఠం వరకు తెలుగు సాహితీ రంగంలో ఆయన ముద్ర సుస్పష్టం. తన 86 సంవత్సరాల నిండు జీవితంలో నాగార్జున సాగరం, కర్పూర వసంతరాయలు, రామప్ప, విశ్వంభర, అజంతా సుందరి లాంటి 87 రచనలతో సినారె సాహితీ సేద్యం చేశారు. ఆయన పరిశోధనా గ్రంథం ‘ఆధునికాంధ్ర కవిత్వము- సంప్రదాయములు, ప్రయోగములు’ దానికదే సాటి. గులేబకావళి కథ మొదలుకొని అరుంధతి వరకు సినీ రంగంలోనూ తనదైన ముద్రవేశారు సినారె. సాహితీ సంపన్నులైన సినారె 88వ జయంతి సందర్భంగా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో వనపర్తిలో ఘనంగా ఉత్సవాలు జరిగాయి. ఈ నేపథ్యంలో తెలుగు సాహిత్యానికి రెండో జ్ఞానపీఠ పురస్కారాన్ని సంపాదించి పెట్టిన సినారె జీవితాన్ని, సాహితీ సేద్యాన్ని వివరిస్తూ, విశ్లేషిస్తూ, ఆయనకు నివాళులు అర్పిస్తూ రాసిన వ్యాసాలు, కవితలను సంకలనం చేస్తూ ‘మన సినారె’ పేరుతో ఎస్.ఎన్.ఆర్ పబ్లికేషన్స్ ఓ గ్రంథాన్ని వెలుగులోకి తెచ్చింది. పుస్తకం మొదట్లోనే పోతన భాగవతంపై సినారె పరిచయం, స్వగ్రామం హనుమాజీపేటలోని వాడుకభాషపై ఆయన రాసిన ‘మా ఊరు మాట్లాడింది’ వ్యాసాలనూ ఇవ్వడం విశేషం.
మన సినారె
పేజీలు: 198, వెల: రూ. 300
ప్రచురణ: ఎస్.ఎన్.ఆర్. పబ్లికేషన్స్
ప్రతులకు: సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఇం.నెం. 35- 6, వల్లభ్నగర్,
వనపర్తి- 509103
హర్షవర్ధన్ చింతలపల్లి