కేసీఆర్ దృఢ చిత్తుడు. మహా మొండి మనిషి. అన్ని అంశాలను తరచి చూసి ఒక నిర్ణయానికి వస్తారు. నిర్ణయానికి వచ్చిన తరువాత హరిహరాదులు చెప్పినా వినరు. ఈ పట్టుదలే తెలంగాణను సాధించేలా చేసింది. సాధించిన తెలంగాణను సస్యశ్యామలం చేసింది. తెలంగాణ ఉద్యమాన్ని నిలిపివేయాలని అనేక బెదిరింపులు వచ్చినా వెనుకడుగు వేయలేదు. తెలంగాణ ఇవ్వక తప్పదని తెలిసిన పరాయి పాలకులు అనేక ప్రతిపాదనలు చేశారు. రాయల తెలంగాణ, హైదరాబాద్లేని తెలంగాణ మొదలైన ప్రతిపాదనలు చేశారు. తెలంగాణలోని నకిలీ మేధావులు, కపట ఉద్యమకారులు అందుకు సై అన్నారు. కానీ కేసీఆర్ మాత్రం గట్టిగా నిలబడ్డారు. పేకాట క్లబ్బులను మూసివేయడం, నకిలీల ఆటకట్టించడం మొదలైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు, ఆయనపై అనేక ఒత్తిడులు వచ్చాయి. అయినా అణుమాత్రం సంకోచించ లేదు. ప్రజా సంక్షేమానికి సంబంధించిన కొన్ని నిర్ణయాలకు ఉన్నతాధికారుల స్థాయిలోనే అభ్యంతరాలు వచ్చిన ఉదంతాలు ఉన్నాయి. అయినా కేసీఆర్ వినరుగాక వినరని అధికార వర్గాల్లో చెప్పుకొంటారు. అంగన్వాడీలు, కాంట్రాక్టు కార్మికులు, పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు పెంచడం, ఆసరా పింఛను ఇవ్వడం, రైతు బంధు ఇవ్వడం, దళిత బంధు ప్రవేశ పెట్టడం మొదలైన అన్ని పథకాలపైనా వ్యతిరేకత ఉన్నప్పటికీ, కేసీఆర్ బెదరలేదు. వెనుకంజ వేయడం ఆయన నిఘంటువులోనే లేదేమో అని అనుకుంటారు.
తెలంగాణలో ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతున్నాయి. సంక్షేమం, మధ్యకాలిక, దీర్ఘకాలిక అవసరాలు తీరుస్తూనే, ఆధ్యాత్మికతలోనూ మతాలకు అతీతంగా అన్నీ చేస్తున్నాం. యాదాద్రి ఆలయాన్ని విశ్వవిఖ్యాత స్థాయిలో నిర్మించుకున్నాం.