మూలాలు మనిషి పునాది. ఎక్కడి నుంచి వచ్చాం అన్న ఎరుక ఉంటేనే.. ఎక్కడికి వెళ్లాలన్న స్పష్టత వస్తుంది. దారితప్పిన ప్రతిసారీ, అశరీరవాణి మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. నిరాశ ఆవరించిన ప్రతి సందర్భంలోనూ కనిపించని హస్తమేదో భుజం తట్టి ధైర్యం చెబుతుంది. ఆ బలమైన మూలాలే సబ్-రిజిస్ట్రార్ తస్లిమాను ‘ఆదివారం కూలీ’ని చేశాయి.
తస్లిమా మహమ్మద్.. వారంలో ఆరు రోజులూ సబ్ రిజిస్ట్రార్. ఆమె తలూపితేనే ఆస్తుల క్రయవిక్రయాలకు ఆమోదముద్ర. కన్నెర్రజేస్తే కోట్ల విలువైన లావాదేవీ అయినా చెత్తబుట్టపాలే. ఏడో రోజైన ఆదివారం మాత్రం.. అచ్చమైన వ్యవసాయ కూలీ! పచ్చ ఇంకుతో సంతకాలు పెట్టిన చేతితోనే.. పచ్చని పొలంలో కలుపు తీస్తారు. ఇదంతా, అదనపు సంపాదన కోసం కాదు. రైతులకూ, రైతు కూలీలకూ అదనపు గౌరవం సంపాదించడం కోసం.
ములుగు జిల్లా రామచంద్రపురం గ్రామానికి చెందిన మహమ్మద్ సర్వర్- ఫాతిమాబీ దంపతులకు నలుగురు పిల్లలు. అందులో మూడో సంతానం తస్లిమా మహమ్మద్. తనకు అక్క, అన్న, తమ్ముడు ఉన్నారు. అంతా బాగానే నడిచిపోతున్న సమయంలో తస్లిమా తండ్రి సర్వర్ను నక్సలైట్లు హతమార్చారు. అప్పుడు తస్లిమా వయస్సు రెండేండ్లు. ఊహకూడా తెలియదు. కుటుంబ భారమంతా తల్లి ఫాతిమాబీపైనే పడింది. అన్నదమ్ముల అండతో ఉన్న కొద్దిపాటి భూమిని సాగుచేస్తూ పిల్లలను పెంచి పెద్ద చేసింది. పెద్ద చదువులు చదివించింది. తల్లి కష్టం తస్లిమా మనసుపై చెరగని ముద్ర వేసింది. తాను కూడా సెలవుల్లో కూలీ పనులకు వెళ్లేది.
కానీ, చదువుల్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. కాకతీయ యూనివర్సిటీనుంచి ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసింది. అనంతరం గ్రూప్-2 రాయాలని నిశ్చయించుకుంది. హైదరాబాద్లోని ఓ శిక్షణ సంస్థలో చేరింది. కోచింగ్ సెంటర్ నిర్వాహకులకు తల్లి ఫీజు కడుతుంటే.. ఆ నోట్ల వెనక తల్లి శ్రమ కనిపించింది. ‘ఉద్యోగంతోనే మళ్లీ ఇంటికెళ్లేది’ అని తీర్మానించుకుంది. పట్టుదలతో గ్రూప్ 2 ఉద్యోగాన్ని సాధించింది. ప్రస్తుతం తస్లీమా ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు సబ్-రిజిస్ట్రార్. మంచి జీతం, హోదా, ముచ్చటైన కుటుంబం.. అన్నీ ఉన్నాయిప్పుడు. కానీ, తన ఆరాటమంతా లేనివారి కోసం.. సమాజంలో గుర్తింపూ గౌరవమూ కరువైన రైతులూ, రైతు కూలీల కోసం.
వారంలో ఒకరోజు ..
నిరుపేద కుటుంబం నుంచి వచ్చినా, తస్లిమా తన మూలాలను మరిచిపోలేదు. ఉద్యోగంలో స్థిరపడ్డాక, తన వంతుగా సమాజానికి ఏదైనా చేయాలనే ఆలోచన మొదలైంది. ఒకసారి స్నేహితులతో కలిసి టూర్కు వెళ్లింది. ఆ సమయంలోనే, సరదాగా అందరూ పొలంలోకి దిగారు. కొద్దిసేపటికే అంతా అలసిపోయి గట్టుమీదికి చేరుకున్నారు. తస్లిమా మాత్రం ఉత్సాహంగా కూలీలతో మూడు నాలుగు గంటలు పనిచేసింది. స్నేహితులంతా మెచ్చుకున్నారు. సరిగ్గా అప్పుడే, తస్లిమా మనసులో ఒక ఆలోచన ప్రాణం పోసుకుంది. వారంలో ఒకరోజు కూలీకి వెళ్లాలని నిశ్చయించుకుంది. నాటి నుంచి వారంలో ఆరు రోజులు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ, ఏడో రోజు మాత్రం కైకిలికి వెళ్లడం ప్రారంభించింది. మట్టి విలువను, శ్రమ సౌందర్యాన్ని ఇలా ఎలుగెత్తి చాటుతున్నదామె.
సాధారణ కూలీలానే..
ఫొటోలకు పోజులిచ్చేందుకో, పేరు కోసమో తస్లిమా కూలీపని చేయడం లేదు. మామూలు కూలీల మాదిరిగానే ముతక చీర కట్టుకుని, పైన పాత షర్ట్ వేసుకుంటుంది. వెంట సద్ది తీసుకెళ్తుంది. నాగలితోనే కాదు, ట్రాక్టర్తో భూమిని దున్నడమూ ఆమెకు తెలుసు. గొర్రు కొట్టడం, నాటు వేయడం, కలుపు తీయడం, మందు చల్లడం, వరికోత.. ఏ పనైనా అలవోకగా చేస్తుంది. పత్తి తీయడంలోనూ దిట్ట. మధ్యాహ్నం వేళ కూలీలతో ముచ్చట్లు పెడుతూ.. తెచ్చుకున్న కూరలను నలుగురితో పంచుకుంటూ.. తృప్తిగా భోజనం చేస్తుంది. సాయంత్రం పని పూర్తయిన తర్వాత, అందరిలా కూలీ పైసలు తీసుకుంటుంది. మిగతా కూలీలు ఆ డబ్బును చీర కొంగులో భద్రంగా దాచుకుంటే, తస్లిమా మాత్రం అక్కడున్నవారిలోనే, ఒక మహిళకు అందిస్తుంది. ఆ పేదరాలి కళ్లలో మెరిసే ఆనందాన్ని చూసి రోజంతా పడిన శ్రమను మరిచిపోతుంది. ఆత్మసంతృప్తి కోసం తస్లిమా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినా, అది స్థానిక యువతలో స్ఫూర్తిని నింపుతున్నది. వాళ్లంతా ఆమె బాటలో పయనించడం మొదలుపెట్టారు. తొలినాళ్లలో తస్లిమా తనకు తెలిసిన రైతుల పొలాలకు వెళ్లేంది. ఇప్పుడు రైతులే స్వయంగా తమ గ్రామాలకు ఆహ్వానిస్తున్నారు.
సమాజ సేవలోనూ..
‘ఆదివారం కూలీ’ తస్లిమా సమాజసేవలోనూ ముందున్నారు. తన తండ్రి పేరిట సర్వర్ చారిటబుల్ ట్రస్ట్ను ఏర్పాటు చేసి, ఎంతోమందికి ఆర్థికంగా చేయూతనిస్తున్నారు. మతి స్థిమితం లేనివారిని చేరదీసి వైద్యశాలలో చేర్పిస్తున్నారు. అనాథలను గుర్తించి ఆశ్రమాలలో నీడ కల్పిస్తున్నారు. గొత్తికోయ, కోయ కుటుంబాల పిల్లలకు నెలనెలా పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. కరోనా సమయంలో అయితే, రేషన్ సరుకులను తీసుకుని గుట్టలు ఎక్కి దిగుతూ, వాగులు దాటుకుంటూ దాదాపు 16 కిలో మీటర్లు నడచి వెళ్లి మారుమూల గూడెమైన పెనుగోడులోని గిరిజనులకు అందించారు. చాలా మంది నిరుపేద కుటుంబం నుంచి వస్తారు. ఉన్నత స్థానానికి, అత్యున్నత స్థానానికి ఎదుగుతారు. అక్కడితో ఆగిపోతారు. గతాన్ని విస్మరిస్తారు. జన్మతః కుబేరుల్లానే వ్యవహరిస్తారు. కానీ, తస్లిమా అలా కాదు.. ఒక మెట్టు పైకి వెళ్లిన ప్రతిసారీ, పేదలకోసం ఓ మెట్టు కిందికి దిగొస్తారు. సామాన్యులలో సామాన్యురాలు అవుతారు.
విలువ చాటాలనే..
నేను రైతు కుటుంబం నుంచి వచ్చాను. ఏ స్థాయికి ఎదిగినా, మన మూలాలను మరిచిపోవద్దు. కానీ, యువత వ్యవసాయాన్నీ రైతునూ చిన్నచూపు చూస్తున్నది. ‘ఆ మట్టి పని మేమేందుకు చేస్తాం?’ అంటూ లేని గొప్పలకు పోతున్నారు. యువత అనే కాదు, చాలామంది రైతులనూ రైతుకూలీలనూ అవమానిస్తున్నారు. ఎగతాళిగా మాట్లాడుతున్నారు.
సేద్యానికి ప్రాణమైన ఆ ఇద్దరికీ తగిన గౌరవం కల్పించాలన్నదే నా తాపత్రయం. దాంతోపాటే, యువతకు శ్రమ విలువను తెలియజెప్పాలి. ఈ ప్రయాణంలో నా భర్త అబ్దుల్ గఫార్, ఇతర కుటుంబసభ్యుల సహకారం మరువలేనిది.
మ్యాకం రవికుమార్