New Delhi : ఢిల్లీలో ఒక వివాహిత యువతి తన ఇంట్లో అనుమానాస్పదంగా మరణించింది. ఘటన జరిగిన తర్వాత నుంచి ఆమె భర్త, కొడుకు కనిపించకుండా పోయారు. ఈ ఘటన ఢిల్లీలోని ప్రహ్లాద్పూర్ బంగర్ గ్రామంలో శనివారం వెలుగు చూసింది. ఈ ఘటనకు సంబంధించి ఢిల్లీలోని షాహ్బాద్ డైరీ పోలీస్ స్టేషన్కు చెందిన పోలీసులు వెల్లడించిన వివరాలివి. పోలీసులకు శనివారం యువతి మరణానికి సంబంధించి సమాచారం అందింది.
దీంతో వారు ఘటన జరిగిన ప్రదేశానికి వెళ్లారు. అక్కడ 22 ఏళ్ల సబిలా ఖాటూన్ అనే యువతి ఇంటి బాత్రూమ్లో అనుమానాస్పదంగా మరణించింది. ఇంట్లో ఆమె భర్త మొహమ్మద్ లాల్బాబు, చిన్నారి కొడుకు లేరు. యువతి మరణించిన ప్రదేశంలోనే ఆనవాళ్లనుబట్టి పోలీసులు మర్డర్ కేసు నమోదు చేశారు. కనిపించకుండా పోయిన భర్త, చిన్నారి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనపై సబిలా సోదరుడు మొహమ్మద్ గులాబ్ పోలీసులకు ఫిర్యాదు సమాచారం ఇచ్చాడు. తాను వారి ఇంటికి వచ్చి చూసేసరికి, తన సోదరి మరణించి ఉన్నట్లు చెప్పాడు.
దీంతో తాను ఈ విషయాన్ని పోలీసులకు తెలిపానన్నాడు. సబిలాకు, లాల్బాబుకు రెండేళ్లక్రితం వివాహం జరిగిందన్నాడు. వారిద్దరి మధ్య విబేధాలున్నట్లు తనకేం తెలియదని వివరించాడు. ప్రాథమిక విచారణ అనంతరం పోలీసులు యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. భర్త, చిన్నారి దొరికిన తర్వాత మిగతా వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.