రాంచీ: హర్యానాలో డీఎస్పీ సురేంద్ర బిష్ణోయ్ను మైనింగ్ మాఫియా రాళ్ల ట్రక్కు ఎక్కించి దారుణంగా హత్యచేసిన ఘటన మరువకముందే జార్ఖండ్లో మరో సంఘటన చోటుచేసుకున్నది. జార్ఖండ్లోని తుపుదనాలో ఓ మహిళా ఎస్ఐని వాహనంతో గుద్ది చంపేశారు. తుపుదనా ఓపీ ఇన్చార్జ్ ఎస్ఐ సంధ్యా తోప్నో (Sandhya Topno) గత రాత్రి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ పికప్ వ్యాన్ ఆమె పైనుంచి దూసుకెళ్లింది. దీంతో ఆ మహిళా ఎస్ఐ అక్కడికక్కడే మరణించారని రాంచీ ఎస్ఎస్పీ వెల్లడించారు. నిందితుడిని అరెస్టు చేశామని, వాహనాన్ని సీజ్ చేశామన్నారు.
కాగా, హర్యానాలో డీఎస్పీ ర్యాంకు సీనియర్ పోలీస్ ఆఫీసర్ను మైనింగ్ మాఫియా రాళ్ల ట్రక్కుతో ఎక్కించి దారుణంగా హత్యచేసిన విషయం తెలిసిందే. పంచ్గావ్ రీజియన్లోని నూహ్ ప్రాంతంలో ఆరావళి పర్వతాలను తొలిచి అక్రమంగా రాళ్లు తరలిస్తున్నారన్న సమాచారంతో డీఎస్పీ సురేంద్రసింగ్ బిష్ణోయ్ మంగళవారం ఉదయం 11.30 ఆ ప్రాంతానికి వెళ్లారు. రాళ్లతో వెళ్తున్న ట్రక్కుకు ఎదురు వెళ్లి ఆపటానికి ప్రయత్నించటంతో డ్రైవర్ ట్రక్కును సురేందర్సింగ్ పైనుంచి పోనిచ్చాడు. దీంతో ఆయన అక్కడికక్కడే మరణించారు. అయితే తప్పించుకుపారిపోతున్న ట్రక్కు డ్రైవర్పై పోలీసులు కాల్పులు జరుపగా నిందితుడి కాలికి గాయమైనట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్టు వివరించారు.