సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక్క మహిళా ఎమ్మెల్యే విజయం సాధించారు. బీజేపీకి చెందిన రీనా కశ్యప్ ఆ ఎన్నికల్లో గెలుపొందారు. నిజానికి ఆ రాష్ట్రంలో దాదాపు 49 శాతం మంది ఓటర్లు మహిళలే ఉన్నారు. రీనా గెలిచినా.. ఆమె పార్టీ మాత్రం తాజా ఎన్నికల్లో ఓటమి చవి చూసింది. 68 స్థానాల్లో కేవలం ఒక్క మహిళా ఎమ్మెల్యే గెలవడం శోచనీయమే.
ఈసారి ఎన్నికల్లో బీజేపీ ఆరు మంది మహిళలకు స్థానాలు కేటాయించింది. కాంగ్రెస్ నుంచి అయిదుగురు, ఆమ్ ఆద్మీ నుంచి ముగ్గురు మహిళలు పోటీపడ్డారు. ఒక్క రీనా మాత్రమే విక్టరీ సాధించింది. పచాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆమె విక్టరీ సాధించారు. ఇదే స్థానం నుంచి ఆమె 2021లో జరిగిన బైపోల్లో కూడా గెలిచారు.
2017 ఎన్నికల్లో హిమాచల్లో మొత్తం నలుగురు మహిళా అభ్యర్థులు విజయం సాధించారు. కానీ ఈసారి పరిస్థితి మరింత దారుణంగా మారింది. రాష్ట్రంలో మహిళా ఓటర్లు 49 శాతం ఉన్నా.. కేవలం ఒకే ఒక్క మహిళ గెలవడం అక్కడి పరిస్థితిని ఎత్తి చూపుతుంది.
మాజీ మంత్రి సర్వీన్ చౌదరీ, ఆశా కుమారి, రీటా థీమన్, చంపా థాకూర్లు ఈసారి ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. 1998 నుంచి హిమాచల్లో ఇప్పటి వరకు మహిళా ఓటర్లే ఆధిక సంఖ్యలో పోలింగ్లో పాల్గొన్నారు.