న్యూఢిల్లీ : దదేశంలో మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులు విపరీతంగా పెరుగుతున్నా మహిళల భద్రతపై చర్చ జరగడం లేదని ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) చీఫ్ స్వాతి మలివాల్ ఆందోళన వ్యక్తం చేశారు. తూర్పు ఢిల్లీలోని మయూర్ విహార్లో ఆరేండ్ల బాలికపై 34 ఏండ్ల వ్యక్తి లైంగిక దాడికి పాల్పడిన ఘటనను ఆమె ప్రస్తావిస్తూ పసిమొగ్గలపై ఎంతకాలం ఇలాంటి పైశాచిక పర్వం కొనసాగుతుందని ప్రశ్నించారు.
దేశంలో మహిళల భద్రతపై ఎందుకు చర్చ జరగడం లేదని ఆమె నిలదీశారు. ఇంకా ఎంతకాలం మైనర్ బాలికలపై అఘాయిత్యాలు జరుగుతాయని స్వాతి మలివాల్ ట్వీట్ చేశారు. కాగా, ఢిల్లీలోని నంగల్ ప్రాంతంలో ఆగస్ట్ 1న జరిగిన తొమ్మిదేండ్ల దళిత బాలిక హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే.