Tripura News CM Manik Saha | త్రిపుర బీజేపీ శాఖ అధ్యక్షుడు మాణిక్ సహా రాష్ట్ర నూతన సీఎంగా ఎంపికయ్యారు. శనివారం బిప్లవ్దేవ్ కుమార్ తన పదవికి రాజీనామా చేయడంతో పార్టీ ఎమ్మెల్యేలు తమ శాసనసభా పక్ష నేతగా మాణిక్ సహాను ఎన్నుకున్నారు. ఏడాదిలోపు అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా త్రిపుర రాష్ట్రానికి బీజేపీ నూతన సీఎంను ఎంచుకోవడం గమనార్హం. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయ తీరాలకు చేర్చలేరన్న సందేహంతోనే బిప్లవ్దేవ్ కుమార్ స్థానంలో మాణిక్ సహాను నియమించినట్లు తెలుస్తున్నది.
వృత్తిరీత్యా దంత వైద్యుడైన మాణిక్ సహా.. ఈ ఏడాది ప్రారంభంలో త్రిపుర నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2016లో కాంగ్రెస్ పార్టీని బీజేపీలో చేరారు. 2020లో బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 25 ఏండ్ల కమ్యూనిస్ట్ పార్టీ పాలనకు ముగింపునిస్తూ బిప్లవ్దేవ్ కుమార్ సారధ్యంలో 2018 ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. మాణిక్ సహా త్రిపుర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గానూ ఉన్నారు. క్రియా శీల రాజకీయాల్లోకి రాకముందు మాణిక్ సహా.. హపానియాలోని త్రిపుర మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్గా పని చేశారు.
త్రిపుర సీఎంగా బిప్లవ్దేవ్ కుమార్ రాజీనామా చేయడంతో.. ఆయన వారసుడిగా డిప్యూటీ సీఎం త్రిపుర రాజ వంశ వారసుడు జిష్ణుదేవ్ వర్మను ఎంపిక చేస్తారని అంతా భావించారు. బీజేపీలో అంతర్గత విబేధాల వల్లే ప్రభుత్వానికి కొత్త సారధిని ఎంపిక చేశారని విమర్శలు ఉన్నాయి.