న్యూఢిల్లీ: అయోధ్యలో నిర్మిస్తున్న భవ్య రామాలయంలో కొలువుదీరే శ్రీరాముడికి జలాభిషేకం కోసం 115 దేశాల నుంచి నీటిని తెప్పించినట్లు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఇది వినూత్న ఆలోచన అని, వసుదైక కుటుంబం సందేశాన్ని ప్రతిబింబిస్తున్నదని అన్నారు. ఏడు ఖండాల్లోని 115 దేశాలకు చెందిన సముద్రాలు, నదులు, నీటి ప్రవాహాల నుంచి సేకరించిన జలాలను శనివారం ఢిల్లీలోని తన నివాసంలో ఆయన స్వీకరించారు. అయోధ్యలోని భవ్య రామ మందిరాన్ని నిర్మిస్తున్న శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, డెన్మార్క్, ఫిజి, నైజీరియాతో సహా అనేక దేశాల రాయబారులు, హైకమిషనర్ల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.
బీజేపీ నేత, ఢిల్లీ మాజీ ఎమ్మెల్యే విజయ్ జొల్లికి నేతృత్వంలో ఢిల్లీ స్టడీ సర్కిల్ ఎన్జీవో సంస్థ ప్రపంచ వ్యాప్తంగా 115 దేశాల నుంచి ఈ జలాలను సేకరించింది. ఆ ఎన్జీవో సంస్థ చేసిన ఈ ప్రయత్నాన్ని రాజ్నాథ్ సింగ్ కొనియాడారు. ‘ప్రపంచంలోని అన్ని దేశాల నుండి నీటిని సేకరించడం భారతదేశంలోని వసుదైక కుటుంబం యొక్క ఆలోచనను ప్రతిబింబిస్తుంది. 115 దేశాల నుండి నీటిని తీసుకురావడం అద్భుతమైన పని. అయోధ్యలో రామాలయ నిర్మాణం పూర్తయ్యే సమయానికి మిగిలిన 77 దేశాల నుండి కూడా నీటిని కూడా సేకరిస్తారు. ప్రపంచ దేశాల నీటితో రామ్ లాలాకి జలాభిషేకం జరుగుతుంది’ అని అన్నారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం ప్రతి ఒక్క భారతీయుడికి గర్వకారణమని వ్యాఖ్యానించారు. ‘భారతీయ సంస్కృతి చాలా గొప్పది. భారతదేశంలో కులం, వర్గం, మతం ఆధారంగా ఎలాంటి వివక్ష లేదు’ అని నొక్కి చెప్పారు.
ప్రపంచ దేశాల నుంచి జలాలను సేకరించడం చరిత్రాత్మకమని రాజ్నాథ్ సింగ్ అన్నారు. ‘అయోధ్యలో సప్తసాగర్ అనే ప్రదేశం ఉంది. త్రేతాయుగంలో రాముడి పట్టాభిషేకం కోసం ప్రపంచంలోని అన్ని మహా సముద్రాల నుండి నీటిని ఇక్కడకు తెచ్చారని భక్తుల విశ్వాసం. ఇప్పుడు రాముడి జన్మస్థలంలో ఆలయం నిర్మితమవుతున్న తరుణంలో మళ్లీ ప్రపంచంలోని అన్ని మహా సముద్రాల నుండి నీటిని తీసుకొస్తున్నాం. ఇది నాకు సెంటిమెంట్తో కూడిన సమస్య ’ అని అన్నారు. అయోధ్యలో రామ మందిరం పునాది మొదటి దశ పూర్తయిందని కూడా ఆయన చెప్పారు.
కాగా, కరోనా మహమ్మారి సమయంలో ప్రజలు తమ ఇళ్ల నుండి బయటకు రాలేకపోయినప్పుడు, తన సంస్థ ప్రపంచ వ్యాప్తంగా 115 దేశాల నుండి నీటిని సేకరించిందని విజయ్ తెలిపారు. కేవలం హిందువులు మాత్రమే కాదు, బౌద్ధులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు, యూదులు కూడా ఈ గొప్ప పనికి దోహదపడ్డారని చెప్పారు. వివిధ దేశాలలోని అన్ని మతాల ప్రజలు వారి దేశాల నుండి నీటిని సేకరించడంలో తమకు సహాయం చేశారని వివరించారు. సేకరించిన జలాలను ఆయా దేశాల పేర్లతో ఉన్న 115 రాగి కలశాల్లో ఉంచినట్లు వెల్లడించారు.