లక్నో: అఖిల భారతీయ అఖాడా పరిషత్కు చెందిన మహంతి నరేంద్ర గిరి అనుమానాస్పద రీతిలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆ కేసులో ఇప్పటికే ఆయన శిష్యుల్ని ముగ్గుర్ని అరెస్టు కూడా చేశారు. అయితే ఓ మహిళతో సన్నిహితంగా ఉన్నట్లు ఫోటోను మార్ఫింగ్ చేయడం వల్లే మహంతి నరేంద్ర గిరి తీవ్ర మానసిక వత్తిడికి లోనయ్యారని, దాని వల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రయాగ్రాజ్లో ఉన్న ఆశ్రమంలో నరేంద్ర గిరి మృతిచెందారు. తన సూసైడ్ నోట్లో రెండు సార్లు ఆనంద గిరి పేరును నరేంద్ర గిరి ప్రస్తావించారు. మహిళతో ఉన్నట్లు మార్ఫింగ్ చేసిన ఓ ఫోటోను ఆనంద గిరి వైరల్ చేయబోతున్నట్లు నరేంద్ర గిరి ఆందోళన చెందారు. ఆ ఫోటో వైరల్ అయితే, తనకు చెడ్డ పేరు వస్తుందని ఆయన అవమానకరంగా ఫీలయ్యారు. సిగ్గుతో బ్రతకడం కంటే, చావడే మేలు అన్న నిర్ణయానికి వచ్చినట్లు నరేంద్ర గిరి తన సూసైడ్ లేఖలో పదేపదే రాశారు. ఆర్థిక అవకతవకలు జరుగుతున్నట్లు ఆనంద గిరి చేసిన ఆరోపణలు కూడా తనను తీవ్రంగా ఇబ్బందిపెట్టినట్లు మహంతి తన లేఖలో తెలిపారు.
కానీ గురూజీ నుంచి పైసలు వసూల్ చేస్తున్నవాళ్లే సూసైడ్ నోట్లో తనకు ఇరికించినట్లు ఆనంద గిరి తెలిపారు. గురూజీ ఇప్పటి వరకు తన జీవితంలో ఒక్క లేఖ కూడా రాయలేదని, ఆ లేఖపై విచారణ చేపట్టాలని ఆనంద గిరి డిమాండ్ చేశారు. ఆయన ఆత్మహత్య చేసుకోలేరని, గురూజీ చేతిరాతను కూడా దర్యాప్తు చేయాలన్నారు. జీవితాన్నంతా ఆశ్రమంలోనే గడిపానని, ఎవరి వద్ద నుంచి డబ్బు తీసుకోలేదని, మా ఇద్దరి మధ్య సంబంధాలు బాగానే ఉన్నాయని, ఈ కేసులో దర్యాప్తు చేపట్టాలని ఆనంద గిరి డిమాండ్ చేశారు. నరేంద్ర గిరి డిప్రెషన్లో ఉన్నట్లు సూసైడ్ నోట్ ద్వారా తెలుస్తోందని పోలీసులు చెబుతున్నారు.