అది 1990
అది 1990 జనవరి 19 రాత్రి.. శ్రీనగర్లోని రేనావాడీ ప్రాంతం.. పండిట్లు కశ్మీర్ను వదిలి వెళ్లిపోవాలని కొందరు మసీదు లౌడ్ స్పీకర్లలో హెచ్చరిస్తున్నారు. ‘పీడక పురుష కాఫీర్లూ.. మీ మహిళలను ఇక్కడే వదిలేసి కశ్మీర్ను విడిచి వెళ్లిపోండి’ అని నినదించారు. ముస్లిం మిలిటెంట్ సభ్యులు హిందువులను టార్గెట్గా చేసుకొని ఊచకోత కోశారు. హిందువుల ఇండ్లను తగులబెట్టి, ప్రాణాలు తీశారు. ఈ ఘటనలతో భయభ్రాంతులకు గురైన లక్షల మంది పండిట్లు రాత్రికి రాత్రే కశ్మీర్ను విడిచి వెళ్లిపోయారు. ఇదే కథాంశంగా ది కశ్మీర్ ఫైల్స్ సినిమా వచ్చింది. ఆ దారుణాలకు నాటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యమే కారణమని చాటి చెప్పేందుకు, రాజకీయంగా పైచేయి సాధించేందుకు ప్రధాని మోదీ స్వయంగా.. అందరూ ఈ సినిమా చూడాలంటూ పిలుపునిచ్చారు.
2022..
ఇప్పుడు 2022లో మోదీ ప్రభుత్వ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉన్న కశ్మీర్లో మళ్లీ 1990 నాటి పరిస్థితి నెలకొన్నది. కశ్మీరీ హిందువులు ఉగ్రవాదుల చేతుల్లో వరుసగా హత్యకు గురవుతున్నారు. గత నెలలో రెవెన్యూ ఉద్యోగి రాహుల్ భట్ను దారుణంగా కాల్చి చంపారు. మొన్నటికి మొన్న కశ్మీరీ పండిట్ అయిన స్కూల్ టీచర్ను బలి తీసుకున్నారు. గురువారం ఉదయం కుల్గాం జిల్లాలో బ్యాంక్ మేనేజర్ విజయ్ కుమార్ను కాల్చి చంపారు. వరుస హత్యలతో బెంబేలెత్తిన కశ్మీరీ పండిట్లు ప్రాణభయంతో మరోసారి వలస బాట పట్టారు. కశ్మీర్లో ఉండలేమంటూ మూటాముల్లె సర్దుకొని లోయను వదిలి వెళ్లిపోతున్నారు. అక్కడ శాంతి భద్రతలను మోదీ సర్కారే పర్యవేక్షిస్తున్నది.
శ్రీనగర్/జమ్ము/న్యూఢిల్లీ, జూన్ 2: ఎవరు ఎక్కడి నుంచి వచ్చి చంపుతారోనని భయం.. ఇంట్లో ఉన్నా, వీధిలో తిరిగినా, ఆఫీస్లో ఉన్నా హత్య చేస్తారన్న బుగులు.. బిక్కుబిక్కుమంటూ, ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని క్షణక్షణం నరకం అనుభవిస్తున్నారు కశ్మీరీ పండిట్లు. 1990 నాటి సంఘటనలు గుర్తుకొచ్చి, మళ్లీ అలాంటి బతుకులు వద్దంటూ లోయను దాటి బయటికి వచ్చేస్తున్నారు. గురువారం బ్యాంక్ మేనేజర్ విజయ్ హత్యతో ఉలిక్కిపడ్డ కొందరు కశ్మీరీ పండిట్ ఉద్యోగులు.. వెంటనే లోయను ఖాళీ చేసి జమ్మూ రీజియన్కు వెళ్లిపోయారు. ఘటన జరిగిన మరుక్షణమే కశ్మీరీ మైనారిటీ(హిందువుల) ఫోరం సభ్యులు సమావేశమై.. ఉన్నపళంగా ఎక్కడికక్కడ ధర్నాలు ఆపేయాలని నిర్ణయించారు. మరో మాట లేకుండా శుక్రవారం ఉదయం నాటికి హిందువులంతా లోయను వదిలి వెళ్లిపోవాలని స్పష్టమైన నిర్ణయం తీసుకొన్నారు. ఓ రిపోర్టు ప్రకారం 4 వేల మంది పండిట్ ఉద్యోగులు కశ్మీర్ లోయను వీడేందుకు సిద్ధమయ్యారు.
భయభ్రాంతులకు గురైన కొందరు హిందువులు.. కశ్మీర్ను వదిలి వెళ్లిపోయేందుకు సిద్ధమవుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ట్రక్కు, ట్రాక్టర్, క్యాబ్.. ఇలా ఏ వాహనం దొరికితే ఆ వాహనంలో వలస వెళ్లిపోతున్నారు. ఇప్పటికే కట్టుబట్టలతో కశ్మీర్ లోయను దాటి బయటకు వచ్చేసిన కొందరు హిందువులు.. కాలినడకనే రోడ్ల వెంట పరుగులు తీస్తున్నారు. ఇంకొందరు ఆకలి దప్పికలతో అలమటిస్తున్నారు. బారాముల్లాకు చెందిన అవతార్ కృష్ణణ్ భట్ మాట్లాడుతూ.. ‘వెంటనే ప్రభుత్వం మమ్మల్ని వేరే చోటుకు సురక్షితంగా చేర్చాలి’ అని వేడుకొన్నాడు. అనంత్నాగ్ జిల్లాలో కొన్ని హిందూ కుటుంబాలు తమ లగేజ్ సర్దుకొని, కశ్మీర్ను వదిలి వెళ్లేందుకు సిద్ధమైన చిత్రాలను ఓ జాతీయ మీడియా సంస్థ ప్రసారం చేసింది.
వలస వెళ్లకుండా బలవంతంగా ఆపుతున్న అధికారులు
ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని కశ్మీర్ లోయ నుంచి వెళ్లిపోతున్న కశ్మీరీ పండిట్ ఉద్యోగులు వలస వెళ్లకుండా అధికారులు అడ్డుకొంటున్నారు. సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సింది పోయి.. శ్రీనగర్-జమ్మూ రహదారిపై చెక్పోస్టులు పెట్టి తిరిగి క్యాంపులకు వెళ్లిపోవాలని ఆదేశిస్తున్నారు. కశ్మీరీ పండిట్ ఉద్యోగులు ఎక్కువగా నివాసం ఉండే శ్రీనగర్లోని ఇంద్రనగర్ ప్రాంతంలో బారికేడ్లు, ముళ్ల కంపలు పెట్టి నిర్బంధించారు. కనీసం తమ కుటుంబాలను కూడా వెళ్లనీయటం లేదని ప్రభుత్వ ఇంజినీరు అశ్వనీ సాధు ఆవేదన వ్యక్తం చేశారు.
అమిత్ షాతో అజిత్ దోవల్, రా చీఫ్ భేటీ
కశ్మీర్ అట్టుడుకుతున్న వేళ కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, రా చీఫ్ సామ్నాత్ గోయల్ సమావేశమయ్యారు. గంటకు పైగా సాగిన ఈ భేటీలో కశ్మీర్ లోయలో భద్రతపై చర్చించినట్టు సమాచారం. కాగా, జమ్మూకశ్మీర్లో భద్రతపై అమిత్ షా శుక్రవారం ఉన్నతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశానికి జమ్మూకశ్మీర్ లెఫ్ట్నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఇతర ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. దోవల్ కూడా హాజరయ్యే అవకాశం ఉన్నది.
వారం క్రితమే కుల్గాం బ్యాంకుకు విజయ్
కుల్గాం జిల్లా మోహన్పొరలోని ఎల్లాఖీ దేహాతి బ్యాంక్ మేనేజర్ విజయ్ కుమార్ను గురువారం ఉదయం ఉగ్రవాదులు కాల్చి చంపారు. నేరుగా బ్యాంకులోని వచ్చి కాల్పులు జరిపి, పరారయ్యారు. ఈ ఘటన దృశ్యాలు బ్యాంకులోని సీసీటీవీలో రికార్డయ్యాయి. విజయ్కుమార్ స్వస్థలం రాజస్థాన్లోని హనుమాన్ఘర్. అంతకుముందు అనంత్నాగ్ జిల్లాలోని వేరే బ్రాంచ్లో పనిచేసిన విజయ్కుమార్ వారం క్రితమే ఇక్కడ విధుల్లో చేరాడు. అతడికి ఈ ఏడాది ఫిబ్రవరిలో పెండ్లి అయ్యింది.
నెలలో ఎనిమిది మంది హత్య
మూడు రోజుల్లో ఇది రెండో ఘటన, వారంలో మూడోది. ఇదే కుల్గాం జిల్లాలో మంగళవారం ఉగ్రవాదులు రజిని బాలా అనే ఓ హిందూ ఉపాధ్యాయురాలిని కాల్చిచంపిన విషయం తెలిసిందే. వారం క్రితం టీవీ నటి అమ్రీన్ భట్ను టెర్రరిస్టులు హత్యచేశారు. అంతకు ముందు మే 12న బడాగాం జిల్లాలో రాహుల్ భట్ అనే కశ్మీరీ పండిట్ను కాల్చిచంపారు. మే 1 నుంచి నెల వ్యవధిలో ఉగ్రవాదులు మొత్తంగా 8 మందిని పొట్టనపెట్టుకున్నారు.
కేంద్రం మాటలు డొల్లే
బ్యాంకు మేనేజర్ విజయ్కుమార్ హత్యను జమ్మూకశ్మీర్లోని రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండించాయి. లోయలో శాంతి భద్రతల్లో ఇది సంక్షోభ పరిస్థితి అని, దీన్ని ఎదుర్కొనేందుకు కేంద్రం రాజకీయ పార్టీలను పిలిచి మార్గం కనుగొనాలని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా సూచించారు. కశ్మీర్ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానం సరిగా లేదని మండిపడ్డారు. కశ్మీర్లో సాధారణ పరిస్థితులు నెలకొల్పామంటూ కేంద్రం చేస్తున్న మాటలు డొల్లే అనే విషయాన్ని తాజా ఘటనలు తేటతెల్లం చేస్తున్నాయని పీడీపీ ప్రధాన కార్యదర్శి గులాంనబీ లోన్ పేర్కొన్నారు. అప్నీపార్టీ, పీపుల్స్ కాన్ఫరెన్స్, తదితర పార్టీల నేతలు కూడా తాజా ఘటన పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. పౌరుల హత్యలకు ముగింపు పలకాలని డిమాండ్ చేస్తూ ఆవామీ ఆవాజ్ పార్టీ కార్యకర్తలు కశ్మీర్లోని లాల్చౌక్ వద్ద ఆందోళన చేశారు.
షోపియాన్లో పేలుడు..
షోపియాన్ జిల్లాలో గురువారం ఓ ప్రైవేటు వాహనంలో పేలుడు జరిగింది. ముగ్గురు జవాన్లకు గాయాలయ్యాయి. పేలుడు గ్రెనేడ్ లేదా ఐఈడీ లేదా బ్యాటరీ పనిచేయకపోవడం వలన చోటుచేసుకున్నదా? అనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని కశ్మీర్ ఐజీ విజయ్కుమార్ పేర్కొన్నారు.
రక్షణలో ప్రభుత్వ ఘోర వైఫల్యం
వరుస దాడులతో పండిట్లు, స్థానికేతర ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమను తక్షణం సొంత జిల్లాలకు బదిలీ చేయాలని డిమాండ్ చేస్తూ వందలాది ఉద్యోగులు గురువారం జమ్ములో ర్యాలీ చేపట్టారు. ఉగ్రకాల్పుల్లో మరణించిన రజని బాలా ఫొటోతో పాటు తమ డిమాండ్తో కూడిన ప్లకార్డులు ప్రదర్శించారు. ‘ఆల్ జమ్ము బేస్డ్ రిజర్వ్డ్ కేటగిరీస్ అసోసియేషన్’ ఆధ్వర్యంలో స్థానిక ప్రెస్క్లబ్ నుంచి అంబేద్కర్ చౌక్ వరకు ర్యాలీ జరిగింది. దాడులను నివారించడంలో, సురక్షిత వాతావరణ కల్పించడంలో కేంద్రం ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. జమ్ములోని జిల్లాలకు చెందిన దాదాపు 8 వేల మంది ఉద్యోగులు కశ్మీర్లో పనిచేస్తున్నారని, ప్రస్తుత వాతావరణంలో అక్కడకు వెళ్లి విధులు నిర్వర్తించలేమని రమేష్ చంద్ అనే ఉపాధ్యాయుడు పేర్కొన్నారు. తమకు ప్రభుత్వ వసతి, ప్రమోషన్లు వంటివి వద్దని, కశ్మీర్ లోయ నుంచి బదిలీ చేస్తే చాలని అంజనా బాలా అనే మరో ఉద్యోగి కోరారు. కశ్మీర్లోనే ఇతర ప్రాంతాలకు బదిలీ చేస్తామన్న ప్రభుత్వ ప్రతిపాదనకు అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వంపై తమకు విశ్వాసం లేదని, వారు చెప్పిన మాటలు విని కశ్మీర్కు వెళ్లి బలిపశువులు కాలేమని మరో టీచర్ వ్యాఖ్యానించారు.
జమ్మూకశ్మీర్లో కశ్మీరీ హిందువులపై జరుగుతున్న దాడులను అరికట్టలేకపోయినందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి డిమాండ్ చేశారు. ‘జమ్మూకశ్మీర్లో రాష్ట్రపతి పాలన కొనసాగుతున్నది. అయినా, రోజుకో కశ్మీరీ హిందువు హత్యకు గురవుతున్నాడు. కచ్చితంగా అమిత్ షా రాజీనామాకు డిమాండ్ చేయాల్సిందే. ఆయనకు క్రీడా మంత్రిత్వ శాఖ ఇస్తే మంచిది. ఈ మధ్య కాలంలో క్రికెట్పై అవసరం లేని ఆసక్తి లభిస్తున్నది’ అని ఎద్దేవా చేశారు.
-సుబ్రమణ్యస్వామి
కశ్మీరీ పండిట్లు మరోసారి వలస బాట పట్టారు. దీనికి పూర్తి బాధ్యత ప్రధాని మోదీదే. 1989లో చేసిన తప్పులనే మోదీ సర్కారు మళ్లీ చేస్తున్నది. సినిమాలను ప్రమోట్ చేయటంలోనే మోదీ ప్రభుత్వం బిజీగా ఉన్నది. పండిట్లను బీజేపీ రాజకీయంగా మాత్రమే వాడుకొంటున్నది.
-ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ