లక్నో: మొదటి భార్యతో భర్తకు సంబంధంపై రెండో భార్య మనస్తాపం చెందింది. ఈ అంశంపై వారి మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రియుడు, కొడుకుతో కలిసి భర్తను హత్య చేసింది. దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. (Woman Kills Husband) ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఈ సంఘటన జరిగింది. సూఫియా బానో, రామ్కిషోర్ వాల్మీకి నాలుగేళ్లుగా రిలేషన్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో రెండేళ్ల కిందట వారిద్దరూ రెండో పెళ్లి చేసుకున్నారు.
కాగా, కొంత కాలం తర్వాత 52 ఏళ్ల మున్నా అలియాస్ ముచ్ఛాద్తో సూఫియాకు వివాహేతర సంబంధం ఏర్పడింది. దీని గురించి వాల్మీకికి తెలిసింది. దీంతో వారిద్దరి మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వాల్మీకి తన మొదటి భార్య కవితా దేవిని కలవడం ప్రారంభించాడు. ఆమెకు ఆర్థిక సహాయం కూడా చేశాడు.
మరోవైపు మాజీ భార్యతో భర్త వాల్మీకి కలవడాన్ని సూఫియా వ్యతిరేకించింది. దీనిపై మనస్తాపం చెందిన ఆమె అతడ్ని హత్య చేసేందుకు ప్లాన్ వేసింది. సెప్టెంబర్ 14న అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రియుడు మున్నా, అతడి సహచరుడు ఇక్బాల్ను తన ఇంటికి పిలిచింది. తలుపు గడియ పెట్టకుండా వదిలేయడంతో వారిద్దరూ ఇంట్లోకి ప్రవేశించారు. బెడ్పై నిద్రిస్తున్న వాల్మీకిని కత్తితో పొడిచి హత్య చేశారు.
ఆ తర్వాత సుఫియా తన 16 ఏళ్ల కుమారుడిని పిలిచింది. నలుగురూ కలిసి వాల్మీకి మృతదేహాన్ని ఒక పెట్టెలో దాచారు. మరుసటి రోజు రాత్రి ఎలక్ట్రిక్ ఆటోలో మృతదేహాన్ని తరలించి ఒక కాలువ వంతెన కింద ఆ పెట్టెను పడేశారు.
అయితే వాల్మీకి ఆచూకీ తెలియకపోవడంతో మొదటి భార్య కవితా దేవి అనుమానించింది. సెప్టెంబర్ 17న మోహన్లాల్గంజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. సుఫియా, ఇతరులు కలిసి వాల్మీకిని హత్య చేసినట్లు ఆమె ఆరోపించింది. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అదే రోజున భావఖేడ కాలువ సమీపంలో పెట్టెలో ఉన్న వాల్మీకి మృతదేహాన్ని కనుగొన్నారు.
కాగా, ఎలక్ట్రిక్ ఆటో ప్రయాణ మార్గాన్ని అనుసరించడంతో పాటు 180 సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పోలీసులు పరిశీలించారు. ఇతర సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించారు. సెప్టెంబర్ 18న సుఫియా బానో, ఆమె ప్రియుడు మున్నా, అతడి అనుచరుడు మహమ్మద్ ఇక్బాల్లను పోలీసులు అరెస్టు చేశారు. సుఫియా 16 ఏళ్ల మైనర్ కుమారుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. హత్యకు ఉపయోగించిన ఆయుధంతో పాటు మృతదేహాన్ని తరలించిన ఈ ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.