లక్నో: ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీలో రైతులను వాహనంతో తొక్కించి హత్య చేసినట్లు ఆరోపణలున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా శుక్రవారం పోలీసుల విచారణకు గైర్హాజరయ్యారు. పోలీసులు సమన్లు జారీ చేసినప్పటికీ యూపీ క్రైం బ్రాంచ్ పోలీస్ కార్యాలయానికి ఆయన రాలేదు. ఈ నేపథ్యంలో యూపీ క్రైం బ్రాంచ్ పోలీసులు శుక్రవారం మరోసారి ఆశిష్ మిశ్రాకు సమన్లు జారీ చేశారు. శనివారం ఉదయం 11 గంటలకు తమ కార్యాలయంలో హాజరు కావాలంటూ కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా నివాసం వద్ద రెండోసారి నోటీసులు అంటించారు.
లఖింపూర్ ఖేరీలో ఆదివారం చెలరేగిన హింసలో 8 మంది మరణించారు. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు శుక్రవారం మరోసారి విచారణ జరిపింది. యూపీ పోలీసుల దర్యాప్తుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. సాక్ష్యాలను భద్రపరుచాలని యూపీ పోలీసులను కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.