లక్నో: ప్రభుత్వ ఉద్యోగిగా పని చేసి రిటైర్డ్ అయిన ఒక వ్యక్తి మరణించాడు. అయితే అతడి కుమార్తె వితంతువుగా నటించింది. పదేళ్లుగా తండ్రికి వచ్చే పింఛను తీసుకుంటున్నది. భర్తతో గొడవ జరుగడంతో ఈ మోసాన్ని పోలీసులకు చెప్పాడు. ఈ నేపథ్యంలో ఆ మహిళను అరెస్ట్ చేశారు . ఉత్తరప్రదేశ్లోని ఎటా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అలీగంజ్కు చెందిన విజరత్ ఉల్లా ఖాన్ సర్వేయర్గా పని చేసి రిటైర్డ్ అయ్యాడు. భార్య సవియా ముందుగానే చనిపోగా, 1987లో అతడు మరణించాడు.
కాగా, తండ్రి విజరత్ ఉల్లా ఖాన్ మరణం తర్వాత ఆయనకు వచ్చే పెన్షన్ డబ్బుల కోసం కుమార్తె మొహాసినా పర్వేజ్ మోసానికి పాల్పడింది. మృతుడి భార్యగా నకిలీ పత్రాలు సృష్టించింది. గత పదేళ్లుగా ప్రభుత్వం నుంచి పింఛనుగా సుమారు రూ.12 లక్షలు పొందింది. ఆమె భర్తకు కూడా ఇదంతా తెలుసు.
మరోవైపు ఇటీవల మొహాసినా పర్వేజ్, ఆమె భర్త మధ్య పోట్లాట జరిగింది. ఈ నేపథ్యంలో భార్య మోసం గురించి పోలీసులకు భర్త ఫిర్యాదు చేశాడు. దీంతో మోహాసినాను అరెస్ట్ చేశారు. నకిలీ పత్రాల ద్వారా వితంతువుగా నమ్మించి పింఛను పొందుతున్న మోసంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.