బాగ్పట్: ఉత్తరప్రదేశ్లో పోలీస్ కానిస్టేబుళ్ల దుస్థితి గురించి, అత్యవసరాలకు కూడా సెలవులు దొరకక ఒత్తిడితో కానిస్టేబుళ్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనల గురించి ఓ కానిస్టేబుల్ చేతులు జోడించి సోషల్ మీడియా ద్వారా ఉన్నతాధికారులకు విన్నవించాడు. యూపీలోని బాగ్పట్ పోలీస్ డిపార్టుమెంట్కు చెందిన కానిస్టేబుల్ ఓం వీర్సింగ్ రికార్డు చేసి సోషల్ మీడియాలో పెట్టిన ఈ 4 నిమిషాల నిడివిగల హృద్యమైన వీడియో వైరల్గా మారింది.
గడిచిన రెండేళ్లలో దాదాపు 10 నుంచి 12 మంది కానిస్టేబుళ్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, రెండు రోజుల క్రితం కూడా అయోధ్యలో ఒక కానిస్టేబుల్, మీరట్లో ఒక కానిస్టేబుల్ తమ సర్వీస్ రైఫిల్స్లో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నారని, ఈ ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయని ఎవరైనా ఆలోచించారా..? అని ఆ వీడియోలో తన ఉన్నతాధికారులను ఓం వీర్ సింగ్ ప్రశ్నించారు.
ఈ ఏడాది జూలై 20న తన సోదరి మరణించిందని, దాంతో సెలవు కావాలని అడిగితే పై అధికారులు ఇవ్వలేదని ఓం వీర్సింగ్ దుఃఖం ఆపుకుంటూ చెప్పడం గుండెలను పిండేస్తున్నది. పోలీస్ కానిస్టేబుళ్లం అయితే మాత్రం.. తాము మనుషులం కాదా..? అని ఆయన ప్రశ్నించారు. తాము అవసరానికి మించిన ఒత్తిడిని భరించాల్సిన దుస్థితి ఎందుకుని నిలదీశారు.
సెలవులు ఇవ్వకపోయినా, కనీసం తమకు పోస్టింగులైనా స్వస్థలాల్లో వేస్తే బాగుంటుందని ఓం వీర్సింగ్ అభిప్రాయపడ్డారు. స్వస్థలాల్లో భార్యాబిడ్డలు, తల్లిదండ్రుల బాగోగులు చూసుకుంటూ హాయిగా ఉద్యోగం చేసుకుంటామన్నారు. దూర ప్రాంతాల్లో పోస్టుంగులు వేస్తే రోజుల తరబడి అక్కడే ఉండాల్సి వస్తుందని, ఆఖరికి ఇంటి మనుషులు మరణించినా రాలేని దుస్థితి నెలకొందని ఓంవీర్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా అధికారులు కానిస్టేబుళ్ల పరిస్థితిని అర్థం చేసుకోవాలని ఆ కానిస్టేబుల్ అభ్యర్థించారు. ఓం వీర్సింగ్ వీడియోపై నెటిజన్ల నుంచి కూడా సానుకూల స్పందనలు వెల్లువెత్తుతున్నాయి. వీడియో చూస్తుంటే గుండె తరుక్కుపోయిందని కొందరు కామెంట్ చేశారు. కానిస్టేబుళ్లను మానసిక వేదనకు గురి చేయవద్దని, సెలవులు ఇస్తే ఉత్సాహంగా పనిచేస్తారని మరికొందరు నెటిజన్లు సూచించారు.
Video of UP police constable Omveer Singh from Baghpat has surfaced on social media. Directs attention towards the cases of suicide by cops. “I am hurt because my sister died on July 20. My leave was not approved,” he said. pic.twitter.com/hGOudoOVHx
— Piyush Rai (@Benarasiyaa) August 27, 2023