Fake Universities : దేశంలో అర్హత లేని ఫేక్ యూనివర్సిటీలు 32 ఉన్నట్లు యూజీసీ (యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్) గుర్తించింది. ఫేక్ యూనివర్సిటీల జాబితాను తాజాగా విడుదల చేసింది. వీటిలో చదివే, చదవాలనుకునే విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని యూజీసీ హెచ్చరించింది. కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలోని, ఉన్నత విద్యా విభాగం ఆధ్వర్యంలో పని చేసే యూజీసీ.. దేశంలో కొనసాగుతున్న యూనివర్సిటీల అర్హతలపై సమీక్ష చేస్తుంది.
తనిఖీలు నిర్వహించి.. తగిన అర్హతలుంటే అనుమతులివ్వడం లేదంటే నిరాకరించడం, బ్లాక్ లిస్టులో పెట్టడం వంటివి చేస్తుంది. ప్రతి ఏటా అలా అర్హత లేని యూనివర్సిటీలను గుర్తించి, నోటీసులు జారీ చేస్తుంటుంది. విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంది. దీనిలో భాగంగా తాజాగా దేశంలో 32 యూనివర్సిటీలు ఫేక్ అని వెల్లడించింది. యూజీసీ యాక్ట్ ప్రకారం ఈ యూనివర్సిటీలు ఇచ్చే డిగ్రీలు, పీజీలు వంటివి చెల్లవు. వాటికి చట్టబద్ధత లేదు. అంటే ఆ యూనివర్సిటీలు జారీ చేసే సర్టిఫికెట్లు ఎందుకూ పనికిరావు. ఇలాంటి యూనివర్సిటీల్లో ఢిల్లీ టాప్లో ఉంది. ఇక్కడ 12 యూనివర్సిటీలు ఫేక్ అని తేలింది.
ఏపీలో గుంటూరులోని క్రిస్ట్ న్యూ టెస్టమెంట్ డీమ్డ్ యూనివర్సిటీ, విశాఖపట్నంలోని బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా అనే యూనివర్సిటీలు ఫేక్ అని వెల్లడించింది. తాజా జాబితాకు సంబంధించి రాష్ట్రాల వారిగా ఫేక్ యూనివర్సిటీలు ఇలా ఉన్నాయి. ఢిల్లీలో 12, యూపీలో 4, ఏపీలో 2, కర్ణాటకలో 2, కేరళలో 2, మహారాష్ట్రలో 2, పుదుచ్చేరిలో 2, పశ్చిమ బెంగాల్లో 2, అరుణాచల్ ప్రదేశ్లో 1, హరియాణాలో 1, ఝార్ఖండ్లో 1, రాజస్థాన్లో 1 చొప్పున యూనివర్సిటీలు ఫేక్ అని తేలింది.