Naziya Khanam : ఢిల్లీలో దారుణం జరిగింది. మూడు నెలల గర్భిణి అనుమానాస్పదంగా మరణించింది. మృతురాలు ప్రభుత్వ ఉద్యోగి. మృతురాలి పేరు నజియా ఖానం (30). భర్త, అత్త, కుటుంబ సభ్యుల వేధింపుల వల్లే నజియా మరణించిందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన ఢిల్లీలోని ద్వారకా నగర్లో ఆగష్టు 21, శుక్రవారం జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నజియా ఖానం రక్షణ మంత్రిత్వ శాఖలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్గా పని చేస్తోంది. నజియాకు ఈ ఏడాది ఏప్రిల్ 11న అజ్మ్ అలీ ఖాన్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. ఇప్పుడు నజియా మూడు నెలల గర్భిణి కూడా. అయితే, ఆమె శుక్రవారం తన ఇంట్లో ఉరివేసుకుంది. నజియాను ఆమె భర్త రాత్రి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. నజియా మృతిపై ఆమె తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
భర్త, అత్తమామలు, ఇతర కుటుంబ సభ్యుల వేధింపుల వల్లే నజియా మరణించిందని ఆరోపిస్తున్నారు. పెళ్లైన తర్వాత నుంచి నజియాను వారు శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నట్లు చెప్పారు. తనను చంపుతామని బెదిరించారని కూడా నజియా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. భర్త అజ్మ్ అలీ ఖాన్, అత్త సామిన్ నిషా, మామ బాబర్ అలీ ఖాన్, ఇతర కుటుంబ సభ్యులు కలిసి ఆమెపై తరచూ వేధింపులకు పాల్పడ్డారు అని చెప్పారు. తనపై జరుగుతున్న వేధింపుల గురించి నజియా తమకు ఫోన్లో ఎన్నోసార్లు ఆవేదనగా చెప్పిందన్నారు. నజియా మృతిపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ ఘటనపై నజియా భర్త చెబుతున్న వివరాలు ఇవి. తనకు, నజియాకు మధ్య గొడవ జరిగింది. వెంటనే ఆమె తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంది. ఎంతకీ తలుపు తెరవకపోవడంతో నజియా భర్త ఇంటి యజమానికి పిలిచాడు. అతడు ఒక నిచ్చెన ద్వారా బాల్కనీలోంచి వెళ్లి ఆమెను రక్షించాడు. ఈలోపు ఆమె చున్నీతో ఫ్యాన్కు ఉరివేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.