తృణమూల్ ఎంపీ డెరెక్ ఓ బ్రెయిన్ను రాజ్యసభ నుంచి సస్పెండ్ చేశారు. ఈ సస్పెన్షన్ ఈ సమావేశాల ముగింపు వరకూ వర్తించనుంది. సభా మర్యాదలకు విరుద్ధంగా ప్రవర్తించడం వల్ల ఈయనపై సస్పెన్షన్ వేటు పడింది. ఎన్నికల సంస్కరణ బిల్లు విషయంపై సభలో చర్చ సాగుతోంది. ఈ సమయంలో డెరెక్ ఓ బ్రెయిన్ స్పందించారు. సాగు చట్టాలను పాస్ చేసినట్లుగా ఈ బిల్లును కూడా పాస్ చేయించుకుంటే కుదరదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా పార్లమెంట్ రూల్ బుక్ను రాజ్యసభ సెక్రెటరీ జనరల్పైకి విసిరి, వాకౌట్ చేసి వెళ్లిపోయారు. ఈ ఘటన తర్వాత కూడా ఎన్నికల సంస్కరణ బిల్లు విషయంలో రాజ్యసభలో తీవ్ర గందరగోళం నెలకొంది. సభ ముగిసిన తర్వాత కేంద్ర మంత్రులు భూపేంద్ర యాదవ్, పీయూశ్ గోయల్ తృణమూల్ ఎంపీ ఓ బ్రెయిన్ వ్యవహారంపై దృష్టి పెట్టారు. చివరికి ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది.
స్పందించిన ఓ బ్రెయిన్
తనపై సస్పెన్షన్ వేటు పడిన తర్వాత తృణమూల్ ఎంపీ ఓ బ్రెయిన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ”గతంలో కూడా నేను సస్పెండ్ అయ్యాను. సాగు చట్టాలను బలవంతంగా రుద్దే సమయంలో ఈ పరిణామం సంభవించింది. ఇప్పుడు ఎన్నికల సంస్కరణ బిల్లును వ్యతిరేకిస్తూ ఉన్న సమయంలో మళ్లీ సస్పెన్షన్ వేటు పడింది.” అంటూ ఓ బ్రెయిన్ ట్వీట్ చేశారు.