న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: కొన్ని అదానీ గ్రూప్ కంపెనీల షేర్లపై అదనపు నిఘా ఉంచనున్నట్టు నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ గురువారం ప్రకటించింది. అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్, గుజరాత్ అంబూజా షేర్లను స్వల్పకాలిక అదనపు పర్యవేక్షణ చర్య (ఏఎస్ఎం) పరిధిలోకి తీసుకు వచ్చామని ఎన్ఎస్ఈ విడుదల చేసిన నోటిఫికేషన్ తెలిపింది. ప్రస్తుతం అమలవుతున్న పర్యవేక్షణా చర్యలకు తోడు ఈ షేర్లపై ఏఎస్ఎం ఫ్రేమ్వర్క్ అమలవుతుందన్న విషయాన్ని మార్కెట్ భాగస్వాములు తెలుసుకోవాలని ఎక్సేంజ్ కోరింది. తీవ్ర ఒడిదుడుకులకు లోనవున్న షేర్ల నుంచి రిటైల్ ఇన్వెస్టర్లను సంరక్షించేందుకు 2018 నుంచి ఏఎస్ఎం ఫ్రేమ్వర్క్ను ఎన్ఎస్ఈ అమలు చేస్తున్నది.