పాట్నా: కశ్మీర్ ఫైల్స్ నిర్మాతలకు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని బీహార్ మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీ ఆరోపించారు. కశ్మీరీ పండిట్లు అక్కడకు తిరిగి వెళ్లకుండా వారిలో భయాందోళనలు కలిగించడానికి ఉగ్రవాద సంస్థలు ఈ మేరకు కుట్ర పన్నాయని విమర్శించారు. దీంతో ఈ సినిమా నిర్మాతలు, డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రికి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉండే అవకాశమున్నదని ఆరోపించారు. ఈ నేపథ్యంలో కశ్మీర్ ఫైల్స్ సినిమా యూనిట్కు ఉగ్రవాదులతో సంబంధాలపై దర్యాప్తు జరుపాలని ఆయన డిమాండ్ చేశారు.
1990లో ప్రాణ భయంతో కశ్మీర్ను వీడిన కశ్మీర్ పండిట్ల దయనీయ పరిస్థితులపై తీసిన కశ్మీర్ ఫైల్స్ సినిమాపై బీజేపీ ప్రశంసలు గుప్పించింది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రిని అభినందించారు. ఇక ఎన్డీయే పాలిత బీహార్తో సహా బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ సినిమాకు పన్ను రాయితీ ప్రకటించారు.
అయితే బీహార్లో ఎన్డీయే కూటమికి చెందిన మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీ మాత్రం భిన్నంగా స్పందించారు. కశ్మీర్ పండిట్లు తిరిగి కశ్మీర్కు వెళ్లకుండా వారిలో భయాందోళనలు రేకెత్తించడంలో భాగంగానే ఈ సినిమాను చిత్రీకరించారని విమర్శించారు. ఈ నేపథ్యంలో సినీ నిర్మాతలు, డైరెక్టర్కు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని ఆయన ఆరోపించారు. దీనిపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.