న్యూఢిల్లీ: రైతును రాజును చేస్తామని ఊదరగొడతారు.. అన్నదాత ఆదాయం రెట్టింపు చేస్తామని అరచేతిలో స్వర్గం చూపిస్తారు. అసలు విషయానికి వచ్చేసరికి అత్తెసరు నిధులిచ్చి చేతులు దులుపుకొంటారు. వ్యవసాయరంగం విషయంలో కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కారు తీరు ఇలాగే ఉన్నది. 2022 నాటికి దేశంలోని రైతులందరి ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని 2015లోనే ప్రధాని నరేంద్రమోదీ హామీ ఇచ్చారు. రైతుల ఆదాయాలు పెరగటం దేవుడెరుగు.. పెట్టుబడి ఖర్చులు మాత్రం తడిసి మోపెడవుతున్నాయి. పెట్టుబడులు పెరగటానికి కేంద్ర ప్రభుత్వమే కారణమని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఎరువులు, పురుగుమందుల వంటి ప్రత్యక్ష వినియోగ వస్తువులతోపాటు డీజిల్ ధరలు విపరీతంగా పెరగటంతో వ్యవసాయ పెట్టుబడి మాత్రం రెండింతలయ్యిందని రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. రైతుల ఆదాయాలు రెట్టింపు చేస్తామన్న ప్రభుత్వం.. అందుకు కట్టుబడి ఉంటే బడ్జెట్లో తగినన్న నిధులు కేటాయించాలి. కానీ, మోదీ సర్కారు గత ఐదేండ్ల నుంచి బడ్జెట్లో సాగుకు నిధుల శాతాన్ని తగ్గిస్తూ వస్తున్నది.
మూడు శాతం మించని బడ్జెట్
మోదీ సర్కారు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన కొత్తలో 2013-14లో కేంద్ర బడ్జెట్లో వ్యవసాయానికి రూ.21,933.50 కోట్లు కేటాయించింది. 2022-23 బడ్జెట్లో దాన్ని రూ.1,24,000 కోట్లకు పెంచింది. ఇలా చూస్తే సాగుకు నిధులు భారీగా పెరిగినట్టే కనిపిస్తాయి. నిజానికి మొత్తం బడ్జెట్లో వివిధ రంగాలకు కేటాయించిన నిధుల శాతం పరంగా చూస్తే వ్యవసాయానికి ఏటా నిధులు తగ్గుతూ వస్తున్నాయి. 2010-14 మధ్య కేంద్ర బడ్జెట్లో వ్యవసాయానికి సగటున 5.2 శాతం నిధులు కేటాయించగా, మోదీ సర్కారు 2015-18 మధ్య 2.4 శాతం మాత్రమే కేటాయించింది. 2021-22 కేంద్ర బడ్జెట్లో వ్యవసాయానికి 3.8 శాతం నిధులు కేటాయించగా, 2022-23లో 3.4 శాతానికి తగ్గించింది. ఈ నిధుల్లోనూ అత్యధికం రైతులకు పెట్టుబడి సాయం అందించే పథకానికే వెళ్తున్నాయి. దేశ జనాభాలో సగం మందికి ఉపాధి కల్పిస్తున్న వ్యవసాయ రంగంలో మౌలిక వసతుల కల్పనపై మాత్రం కేంద్రం దృష్టి పెట్టడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.